Liver Health News: సాధారణంగా మన ఆరోగ్యం మెరుగుపడాలంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, కాలేయం దెబ్బతిన్న వారి విషయంలో ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. దెబ్బతిన్న కాలేయం మనం తినే ఆహారంలోని వ్యర్థాలను సరిగ్గా శుభ్రం చేయలేకపోవడం వల్ల, ఆ వ్యర్థాలే క్యాన్సర్ గడ్డలు పెరగడానికి కారణంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
సాధారణంగా మనం తీసుకునే ప్రోటీన్ జీర్ణమైనప్పుడు శరీరంలో అమ్మోనియా అనే వ్యర్థ పదార్థం విడుదలవుతుంది. ఆరోగ్యంగా ఉన్న కాలేయం ఈ అమ్మోనియాను 'యూరియా'గా మార్చి మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. అయితే ఫ్యాటీ లివర్, హెపటైటిస్ లేదా మద్యం వల్ల కాలేయం దెబ్బతిన్నప్పుడు, ఈ శుభ్రపరిచే ప్రక్రియ ఆగిపోతుంది. దీనివల్ల రక్తంలో అమ్మోనియా పేరుకుపోతుంది. ఈ పేరుకుపోయిన అమ్మోనియాను క్యాన్సర్ కణాలు తమ ఎదుగుదలకు అవసరమైన ఆహారంగా మార్చుకుంటున్నాయని రట్జర్స్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది.
పరిశోధకులు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలేయ వ్యాధి ఉన్న ఎలుకలకు ప్రోటీన్ తక్కువగా ఉండే ఆహారం ఇచ్చినప్పుడు, వాటిలో క్యాన్సర్ గడ్డల పెరుగుదల నెమ్మదించింది. అంతేకాకుండా, ఆ ఎలుకలు ఎక్కువ కాలం జీవించగలిగాయి. తక్కువ ప్రోటీన్ వల్ల శరీరంలో తక్కువ అమ్మోనియా తయారవుతుందని, దీనివల్ల క్యాన్సర్ కణాలకు కావాల్సిన నైట్రోజన్ అందక అవి బలహీనపడతాయని శాస్త్రవేత్త వెయి-క్సింగ్ జోంగ్ వివరించారు.
అయితే ఇది అందరికీ వర్తించే సూత్రం కాదు క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు సాధారణంగా నీరసం రాకుండా ఉండటానికి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని చెబుతుంటారు. కానీ కాలేయ వ్యాధులు ఉన్నవారు మాత్రం ప్రోటీన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రోటీన్ మరీ ఎక్కువగా తీసుకుంటే కాలేయంపై భారం పడి, క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. అదే సమయంలో మరీ తక్కువగా తీసుకుంటే శరీరం బలహీనపడే ప్రమాదం ఉంది. అందుకే ఎంత తీసుకోవాలనేది డాక్టర్ల సలహా మేరకే నిర్ణయించుకోవాలి.
ఈ పరిశోధన కాలేయ క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఆహార నియమాల ద్వారా లేదా అమ్మోనియాను తగ్గించే మందుల ద్వారా క్యాన్సర్ను అరికట్టవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న కోట్లాది మందికి ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక.