Iran Israel War 2026: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఆయన ఫోన్లో మాట్లాడారని సమాచారం. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపనపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ముఖ్యంగా యుద్ధం కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావంపై మోదీ చర్చించారు.
ప్రస్తుతం జరుగుతున్న దాడుల వల్ల చమురు, సహజవాయువు మౌలిక వసతులు దెబ్బతినడం పట్ల మోదీ ఆవేదన చెందారు. ఇలాంటి దాడులు ప్రపంచ దేశాల ఇంధన భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆయన పేర్కొన్నారు. సముద్ర మార్గాల ద్వారా జరిగే నౌకా రవాణాకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగాలంటే ఆ ప్రాంతంలో ప్రశాంతత చాలా అవసరమని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇదే సమయంలో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు ప్రధాని మోదీ రంజాన్ పండుగ ఇరాన్ నూతన సంవత్సరం 'నవ్రోజ్' శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి. చర్చల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని, హింస ఎప్పటికీ దేనికీ పరిష్కారం కాదని భారత్ నమ్ముతుందని మోదీ పునరుద్ఘాటించారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇరాన్లో ఉన్న భారతీయ పౌరుల రక్షణ గురించి కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అక్కడ నివసిస్తున్న భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నందుకు ఇరాన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ఇరు దేశాలు సమన్వయంతో పనిచేయాలని వారు నిర్ణయించుకున్నారు. పశ్చిమాసియాలో త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని, శాంతి సుస్థిరతలు మళ్లీ నెలకొంటాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని దేశాలు సంయమనం పాటించి, శాంతి చర్చలకు మొగ్గు చూపాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రాంతం వైపు ఆశగా చూస్తున్న తరుణంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.