సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, సరైన కథల ఎంపిక, సహనం, టైమింగ్ కూడా ఉండాలి. అలాంటి ప్రయాణంలో తనదైన గుర్తింపును నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్న నటి కళ్యాణి ప్రియదర్శన్.
మలయాళ స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, ‘స్టార్ కిడ్’ అన్న ముద్రకే పరిమితం కాకుండా తన నటనతోనే అవకాశాలు సంపాదించుకుంటూ కెరీర్ను ముందుకు నడిపిస్తోంది.
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన కళ్యాణి, ఆ సినిమా కమర్షియల్గా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా తన స్క్రీన్ ప్రెజెన్స్తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘చిత్రలహరి’ మూవీలో నటించినా తెలుగులో పెద్ద బ్రేక్ మాత్రం దక్కలేదు.
దీంతో మలయాళ చిత్రసీమపై ఎక్కువ దృష్టి పెట్టిన ఆమె, అక్కడ మంచి కథలు ఎంచుకుంటూ తన స్థానాన్ని బలపరుచుకుంది. కళ్యాణి కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది ఇటీవల విడుదలైన ‘ లోక చాప్టర్ 1 : చంద్ర’ సినిమా. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని సాధించింది.
సినిమాలో సూపర్ హీరోయిన్ తరహా పాత్రలో కనిపించిన కళ్యాణి, యాక్షన్ సన్నివేశాలు, సాహసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా కంటెంట్, స్క్రీన్ప్లే, ప్రెజెంటేషన్తో పాటు కళ్యాణి నటన కూడా ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది. ఇది కళ్యాణి కెరీర్లోనే కాదు, మలయాళ చిత్ర పరిశ్రమలోనే అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలవడం విశేషం. ఈ విజయంతో ఆమె పేరు పాన్ ఇండియా స్థాయిలో వినిపించడం మొదలైంది.
అయితే ఈ విజయానికి ముందు తాను ఎంతో భయపడ్డానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణి వెల్లడించింది. ‘లోక చాప్టర్ 1: చంద్ర’ విడుదల రోజు తాను విపరీతమైన టెన్షన్కు గురయ్యానని చెప్పింది. ‘‘నన్ను ప్రేక్షకులు సూపర్ హీరోగా అంగీకరిస్తారో లేదో అన్న భయం వెంటాడింది.
విడుదల రోజు భయంతో బయటికి కూడా రాలేదు. నాతో పాటు మా టీమ్ అంతా విమర్శలు వస్తాయేమోనన్న ఆందోళనతో గదుల్లోనే ఉన్నాం. మధ్యాహ్నం వరకు మాకు ఉపశమనం లేదు. కానీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత మంచి రివ్యూలు వస్తున్నాయని తెలిసిన వెంటనే అందరం బయటికి వచ్చి సంబరాలు చేసుకున్నాం’’ అంటూ ఆమె ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకుంది.
తాము ఎంత భయపడ్డామో అంతకంటే ఎక్కువగా ప్రేక్షకుల స్పందన రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ భారీ విజయం తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రస్తుతం ఆమె ‘జెన్నీ’ అనే చిత్రంలో నటిస్తోంది.
తాజాగా ఆమె ఓ భారీ బడ్జెట్ చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో కార్తీకి జంటగా కళ్యాణి నటించనుంది. కార్తీ ప్రస్తుతం తన 29వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘మార్షల్’ అనే పీరియాడికల్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను కొత్త దర్శకుడు తమిళ తెరకెక్కిస్తుండగా, డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సముద్ర తీర ప్రాంతాన్ని నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ డ్రామా, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లో నటించడం కళ్యాణి కెరీర్కు మరో కీలక అడుగుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.