పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల సత్తా..
కార్పొరేట్ స్కూళ్లకు చెక్… సర్కారీ బడుల విజయ గాథ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది పలికిన ఫలితాలుగా ఈ ఏడాది పదో తరగతి రిజల్ట్స్ నిలిచాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని ఈ ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఇప్పటివరకు పదో తరగతి ఫలితాల తర్వాత పత్రికలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ప్రకటనలతో నిండిపోయేవి. కానీ ఈసారి దృశ్యం పూర్తిగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో భారీ ప్రకటనలు వెలువడటం విశేషం. ఇది కేవలం ప్రచారం కాదు… ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకానికి ప్రతీకగా మారింది.
కొన్ని గ్రామాల్లో అయితే ఈ విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఊరేగింపులు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను ప్రభుత్వం గర్వంగా ప్రకటించడం విద్యార్థుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.
ఈ ఫలితాల వెనుక ఎలాంటి ప్రలోభాలు లేకుండా విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం కలిసి పనిచేశాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం ఇప్పుడు బలపడింది.
మంత్రి లోకేష్ చేపట్టిన విద్యా సంస్కరణలు క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు పోటీ పెరిగింది. కొన్ని చోట్ల ‘నో వెకెన్సీ’ బోర్డులు కనిపించడం ఈ మార్పుకు నిదర్శనం. కార్పొరేట్ విద్యాసంస్థల ఆధిపత్యానికి చెక్ పెడుతూ, సామాన్యుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో విద్యాశాఖ సాధించిన ఈ విజయం రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది.