ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలను యువతకు చేరువ చేస్తోంది. ఇప్పటికే జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం శిక్షణ అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు దుబాయ్ ఉద్యోగాలపై దృష్టి సారించింది.
ఈ క్రమంలో గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ దుబాయ్లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 22లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించారు.
దుబాయ్లో లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవకాశాలు కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తాయి. అభ్యర్థుల వయసు 21 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి. శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు అధిక బరువు ఉండకూడదని నిబంధనగా పేర్కొన్నారు.
అలాగే అభ్యర్థులకు ఆంగ్ల భాషలో కనీసం ఎల్–2 స్థాయి పరిజ్ఞానం ఉండాలి. కఠిన పరిస్థితుల్లోనూ పనిచేయగల సామర్థ్యం అవసరమని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఆన్లైన్ లేదా ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,450 జీతం అందిస్తారు. అదనంగా రవాణా, వైద్యం, ఇన్సూరెన్స్, వసతి, వర్క్ వీసా, విమాన టికెట్ వంటి సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. ఆసక్తి గలవారు నైపుణ్యం పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 99888 53335, 87126 55686 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.