విజయనగరం జిల్లాలో కీలకమైన చీపురుపల్లి రైల్వే వంతెన ఎట్టకేలకు అందుబాటులోకి రావడంతో ప్రజలకు పెద్ద ఊరట లభించింది. నాలుగేళ్లుగా మూతపడిన ఈ వంతెన తిరిగి రాకపోకలకు తెరుచుకోవడంతో, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించినట్టైంది. వంతెన పనులు పూర్తికావడంతో ప్రస్తుతం తాత్కాలికంగా వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చిన అధికారులు, త్వరలోనే అధికారిక ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
2021లో ఈ పాత రైల్వే వంతెన శిథిలావస్థకు చేరడంతో భద్రతా కారణాల దృష్ట్యా రాకపోకలను నిలిపివేశారు. అప్పటి నుంచి చీపురుపల్లి మీదుగా వెళ్లాల్సిన వాహనాలు, బస్సులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా పాలకొండ డిపో నుంచి విశాఖపట్నం, విజయనగరం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రయాణికులు ఒకే ప్రయాణానికి రెండు నుంచి మూడు బస్సులు మారాల్సి రావడంతో సమయం, డబ్బు రెండూ నష్టపోయారు.
వంతెన మూతపడిన తర్వాత ఆర్టీసీ బస్సులు రాజాం, చిలకపాలెం మార్గాల్లో తిరగాల్సి వచ్చింది. దీని వల్ల ప్రయాణ దూరం పెరిగి, గంట నుంచి రెండు గంటల వరకు అదనపు సమయం పట్టేది. గతంలో పాలకొండ డిపో నుంచి విశాఖపట్నానికి రోజుకు దాదాపు 49 బస్సులు తిరిగేవి. వంతెన మూసివేయడంతో ఆ సంఖ్య 18కి పడిపోయింది. ఫలితంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కాకుండా, ఆర్టీసీ ఆదాయంపై కూడా ప్రభావం పడింది. రోజుకు సుమారు రూ.2 లక్షల మేర ఆదాయం తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి నాలుగేళ్ల పాటు కొనసాగడంతో ఆర్టీసీకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
చీపురుపల్లి వంతెన అందుబాటులోకి రావడంతో ఈ సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలకొండ, పరిసర ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం బయట ప్రాంతాల్లో నివసిస్తున్న వారు పండుగల సమయంలో సొంత ఊళ్లకు వచ్చే సమయంలో ఈ వంతెన ఎంతో ఉపయోగపడనుంది. ఈసారి సంక్రాంతి ప్రయాణాల్లో ప్రజలకు పెద్దగా ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు.
ఈ వంతెనపై రాకపోకలు పునరుద్ధరించడంతో ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వైపు వెళ్లే వారికి కూడా ప్రయాణం సులభమవుతుంది. గతంలో ఈ వంతెన మూతపడటంతో ప్రజలు అదనంగా 40 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది. దీంతో ప్రయాణ ఖర్చులు పెరిగి, సమయం కూడా వృథా అయ్యేది. ఇప్పుడు నేరుగా ఈ మార్గం అందుబాటులోకి రావడంతో ప్రయాణం సౌకర్యవంతంగా మారనుంది.
ఆర్టీసీ అధికారులు వంతెనను పూర్తిస్థాయిలో ప్రారంభించిన వెంటనే విశాఖపట్నం రూట్లో మునుపటిలాగే బస్సుల సంఖ్య పెంచుతామని తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు సర్వీసులు కూడా నడపనున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే, చీపురుపల్లి రైల్వే వంతెన తిరిగి అందుబాటులోకి రావడం ఉత్తరాంధ్ర ప్రజలకు నిజంగా ట్రాఫిక్ ఫ్రీ జర్నీకి మార్గం వేసినట్టేనని చెప్పవచ్చు. సమయం, డబ్బు ఆదా కావడమే కాకుండా, రోజువారీ ప్రయాణాల్లో సౌలభ్యం పెరగనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.