ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేలా వారు తీసుకున్న రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోదం లభించింది.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 11,479 మంది ఎస్సీ లబ్ధిదారులకు లాభం చేకూరనుంది. మొత్తం రూ.41.61 కోట్ల మేర వడ్డీ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో నేషనల్ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులు మళ్లీ కొత్త రుణాలు పొందేందుకు అవకాశం ఏర్పడింది.
కేబినెట్ సమావేశంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నాబార్డ్ నుంచి రూ.7,387 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అలాగే లైఫ్ ట్యాక్స్ వర్తించే మోటారు వాహనాలపై 10 శాతం రోడ్ సేఫ్టీ సెస్ విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు శుభవార్తగా డీఏ, డీఆర్లను 3.64 శాతం పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ప్రస్తుతం 33.67 శాతంగా ఉన్న డీఏ, డీఆర్ 37.31 శాతానికి పెరగనున్నాయి.
ఇదే సమావేశంలో గ్రామ సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా, వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నంలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు, తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ కోసం 28.37 ఎకరాల భూమి బదిలీ, అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు, ఉండవల్లిలో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణం వంటి ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎస్సీ రుణాల వడ్డీ మాఫీ, అభివృద్ధి ప్రాజెక్టులు, ఉద్యోగుల సంక్షేమ నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.