ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రంగా భయపెడుతోంది. గత రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 2 వేలకుపైగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కేసులు, మరణాలు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఆ తర్వాత తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 2023లో 548 కేసులు, 2024లో 514 కేసులు నమోదుకాగా, 2025లో ఇప్పటివరకు 491 కేసులు వెలుగులోకి వచ్చాయి. అంటే ప్రతి ఏడాది ఈ వ్యాధి కొనసాగుతూనే ఉంది.
స్క్రబ్ టైఫస్ వ్యాప్తికి ప్రధాన కారణం అపరిశుభ్రత, అవగాహన లోపమేనని వైద్యులు చెబుతున్నారు. చాలామంది జ్వరాన్ని సాధారణ సమస్యగా భావించి, ఇంటి మందులు వాడుతూ ఆలస్యంగా ఆసుపత్రులకు వెళ్తున్నారు. దీంతో వ్యాధి తీవ్రరూపం దాల్చి ప్రాణాపాయం ఏర్పడుతోంది. ప్రారంభ దశలో గుర్తిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యవసాయ ప్రాంతాలు, పొదలు, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కనిపించే ‘చిగ్గర్ మైట్’ అనే చిన్న పురుగు కాటు వల్లే స్క్రబ్ టైఫస్ వస్తుంది. ఈ పురుగు చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో వ్యాధి తీవ్రత పెరగడం వైద్యులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో మరణాలు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం.
పరిస్థితి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. స్క్రబ్ టైఫస్పై లోతైన అధ్యయనం చేయడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే, అంటువ్యాధుల నియంత్రణ కోసం జాతీయ వైద్య సంస్థలు, నిపుణులతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరమని ప్రభుత్వం సూచిస్తోంది