Politics- పుట్టపర్తి ఆకాశంలో స్టీల్త్ గర్జన.. ఏపీ దశ మార్చనున్న AMCA ప్రాజెక్టు…
రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర: ఏపీలో 5వ తరం యుద్ధ విమానాల ఉత్పత్తి….
చంద్రబాబు నాయుడు విజన్.. పుట్టపర్తికి రానున్న భారీ డిఫెన్స్ హబ్….
AP Investments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా మారబోతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశంలోనే అత్యంత శక్తివంతమైన 5వ తరం యుద్ధ విమానాలను (AMCA - అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్) తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 600 ఎకరాల భూమిని DRDOకి కేటాయించింది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పుట్టపర్తికి చేరుకుంది. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA) ఈ విమానాల రూపకల్పన బాధ్యతలు చూస్తోంది. ఇక్కడ మొత్తం 140 అత్యాధునిక స్టీల్త్ యుద్ధ విమానాలను తయారు చేయాలనేది లక్ష్యం. ఈ విమానాలు శత్రువుల రాడార్లకు కూడా చిక్కకుండా ఆకాశంలో దూసుకుపోగలవు.
పుట్టపర్తిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని భౌగోళిక అనుకూలత. ఇది బెంగళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల విమాన భాగాల రవాణా సులభమవుతుంది. అలాగే, బెంగళూరు విమానాశ్రయం రద్దీగా ఉండటంతో, యుద్ధ విమానాలను పరీక్షించడానికి (Flight Testing) పుట్టపర్తిలో ఉన్న రన్వే మరియు ఖాళీ ఆకాశం చాలా అనువుగా ఉంటాయని రక్షణ శాఖ భావించింది.
ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రముఖ ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వాములు కానున్నాయి. టాటా (tata), ఎల్అండ్టి (L&T), మరియు భారత్ ఫోర్జ్ వంటి పెద్ద కంపెనీలు ఈ విమానాల తయారీలో కీలక పాత్ర పోషించనున్నాయి. దీనివల్ల రక్షణ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగి, వేగంగా విమానాల ఉత్పత్తి జరుగుతుంది.
ఈ ప్రాజెక్టుతో శ్రీ సత్యసాయి జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. లక్ష కోట్ల పెట్టుబడితో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. శాస్త్రవేత్తల కోసం ల్యాబ్లు, నివాస సముదాయాలు, మరియు అనుబంధ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పుట్టపర్తి, ఇప్పుడు ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ హబ్గా ఎదగబోతోంది.