నీరు చెట్టు కార్యక్రమం ఎంతో ఉపయోగకరమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు..
శ్రీకృష్ణదేవరాయల కాలంలో తవ్విన కాలువలు చెరువులను తిరిగి పునరుద్ధరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం..
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన జలధార–జలహారతి కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన “నీరు–చెట్టు” కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని, అయితే ఆ సమయంలో వైసీపీ నేతలు దానిపై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమం ఎంత ఉపయోగకరమో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైందన్నారు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన కాలువలు, చెరువులను పునరుద్ధరించేందుకు “నీరు–చెట్టు” కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తుచేశారు. కొలిమిగుండ్ల మండలంలోని కనకాద్రిపల్లె, తిమ్మనాయుని పేట గ్రామాల్లో ఈ కార్యక్రమం కింద పనులు నిర్వహించామని చెప్పారు.
ప్రతి పంట భూమికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను “అపర భగీరథుడు”గా అభివర్ణించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఐదేళ్లలో ఒక్క వాగు, చెరువు, కాలువలో కూడా మట్టి తీసే పనులు జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిన పరిస్థితిని ఇప్పుడు మళ్లీ ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
బనగానపల్లెలో పడమటపల్లె ప్రాంతానికి తాగునీరు అందించేందుకు కట్టుబడి పని చేశానని చెప్పారు. దద్దనాల చెరువు ప్రాజెక్టును గతంలో 9 నెలల్లో అభివృద్ధి చేసి, మూడు సంవత్సరాలు సవ్యంగా నడిపామని, తర్వాత నిర్వహణ లేకపోవడంతో అది నిర్లక్ష్యానికి గురైందన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.27 లక్షల సొంత నిధులతో మోటర్ల మరమ్మత్తులు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ.5-6 లక్షలు ఖర్చవుతున్నాయని చెప్పారు.
భూగర్భ జలాలను పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సముద్రం మాదిరిగా మన పొలాల్లో కూడా 3 మీటర్ల లోతులో నీటి మట్టం పెరగాలంటే అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ వినియోగం తగ్గి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు.
రైతులు స్వచ్ఛందంగా ట్రాక్టర్లు, జేసీబీలు అందించి శ్రమదానం చేస్తే ప్రభుత్వం కూడా సహకరిస్తుందని తెలిపారు. ఈ విధంగా పనిచేస్తే 20 కిలోమీటర్ల పరిధిలో పంటలు బాగా పండుతాయని అన్నారు. వ్యవసాయంతో పాటు హార్టికల్చర్పై రైతులు దృష్టి పెట్టాలని, ఏ గ్రామాల్లో ఏ పంటలు అనుకూలమో అధికారులు నివేదిక రూపొందించాలని సూచించారు. దానిని కేస్ స్టడీగా తీసుకుని రైతులను ప్రోత్సహిద్దామని చెప్పారు.
సరైన ప్రణాళికతో, చిత్తశుద్ధితో పని చేస్తేనే ఫలితాలు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. కేవలం గుంతలు తవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని, సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ఇప్పటికే గ్రావెల్ రోడ్ల అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా రూ.80 కోట్ల వరకు నష్టం చవిచూసినప్పటికీ ప్రజల అభివృద్ధి కోసం వెనుకాడలేదని తెలిపారు.
రైతుల శ్రమదానానికి ప్రభుత్వం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కొలిమిగుండ్లలో ఈ విధానం విజయవంతమైతే భవిష్యత్తులో బనగానపల్లెలో కూడా ఇదే తరహాలో శ్రమదానం కార్యక్రమాలు చేపడతామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.