నాలుగు కీలక పార్లమెంట్ కమిటీలను పునర్ వ్యవస్థీకరణ..
ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర..
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2026–27 సంవత్సరానికి సంబంధించిన నాలుగు కీలక పార్లమెంట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీలు ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, పారదర్శకతను పెంచడం వంటి ముఖ్య బాధ్యతలను నిర్వహిస్తాయి.
లోక్సభకు చెందిన 30 మంది సభ్యులతో కూడిన అంచనాల కమిటీ (కమిటీ ఆఫ్ ఎష్టిమేట్స్)కి బీజేపీ ఎంపీ డా. సంజయ్ జైస్వాల్ ను ఛైర్మన్గా నియమించారు.
లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 మంది సభ్యులతో కూడిన పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీకి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా అధ్యక్షత వహించనున్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కాంగ్రెస్ ఎంపీ కే.సీ. వేణుగోపాల్ ను ఛైర్మన్గా నియమించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 మంది సభ్యులు ఉంటారు.
అనుసూచిత జాతులు, అనుసూచిత తెగల సంక్షేమ కమిటీకి బీజేపీ ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్తే ను ఛైర్మన్గా నియమించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు.
ఈ కమిటీల పదవీకాలం ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుంది. పార్లమెంటరీ వ్యవస్థలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ ఖర్చులు, ప్రజా రంగ సంస్థల పనితీరు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షిస్తూ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ఇవి ప్రధాన బాధ్యత వహిస్తాయి.