Narendra Modi: 4,399 రోజుల అప్రతిహత ప్రస్థానం.. ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన!
Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ ఒక చారిత్రక మైలురాయిని అందుకున్న సందర్భంగా మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
- సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు, లోకేశ్ అభినందనలు..
- Politics: వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర నిర్మిస్తామని వెల్లడి..
ప్రధాని మోదీ పరిపాలనా దక్షతను అభినందిస్తూ.. ఒక సాదాసీదా నిరుపేద ఇంట్లోని మంచినీటి కుళాయి కనెక్షన్ నుంచి అంతరిక్షంలో సాధించిన 'చంద్రయాన్' అద్భుత విజయం వరకు, పొలంలో శ్రమిస్తున్న సాధారణ రైతు ఆకాంక్షల నుంచి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుడి ధైర్యం వరకు.. కేంద్ర ప్రభుత్వ ప్రగతి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ సమంగా అందేలా మోదీ చూశారని చంద్రబాబు కొనియాడారు. సమాజంలో వెనుకబడిన, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా పూర్తి మద్దతు ఇస్తూనే, మరోవైపు కఠినమైన ఆర్థిక సంస్కరణలతో దేశ పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి బాటలు వేయడం ఆయన పాలనలోని గొప్ప ప్రత్యేకత అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో నేడు భారతదేశం తన భవిష్యత్తుపై మరింత అచంచలమైన విశ్వాసంతో, నిర్దేశిత లక్ష్యాలపై మరింత ఆశావహ దృక్పథంతో అంతర్జాతీయంగా దూసుకుపోతోందని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి మరోసారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘వికసిత భారత్’ అనే మోదీ ఉన్నత దార్శనికతకు మరియు ఆశయాలకు అనుగుణంగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘స్వర్ణాంధ్ర’ను నిర్మించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి కొనసాగుతుండడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా ఎన్నికై, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా మోదీ నిలవడం చరిత్రాత్మకమని అన్నారు.
ఈ విషయంపై నారా లోకేశ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి మోదీ నెలకొల్పిన ఈ రికార్డు అనితరసాధ్యం" అని కొనియాడారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక అజేయశక్తిగా సగర్వంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు అవకాశాలు, గౌరవం కల్పించడంతో పాటు, దేశాన్ని స్వావలంబన, సాధికారత దిశగా నడిపించిన ఘనత మోదీకే దక్కుతుందని లోకేశ్ ప్రశంసించారు. మోదీ సమర్థవంతమైన నాయకత్వానికి జేజేలు పలుకుతున్నట్లు ఆయన తన ప్రకటనలో వివరించారు.
Be the first to react