H1B visa: మోసపూరిత మార్గాల్లో పౌరసత్వం.. భారత సంతతి వ్యాపారవేత్తపై అమెరికా కొరడా.. ఎవరీ నీరజ్ శర్మ?
H1B visa: అమెరికాలో మోసపూరిత మార్గాల్లో పౌరసత్వం పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై న్యాయ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త నీరజ్ శర్మ (50) సహా మొత్తం 17 మంది పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు (డీనేచురలైజేషన్) ప్రక్రియను ప్రారంభించింది.
- పౌరసత్వ దరఖాస్తులో నేర చరిత్రను దాచిపెట్టారని వెల్లడి..
- World: ఈ జాబితాలో భారత సంతతి వ్యాపారవేత్త నీరజ్ శర్మ పేరు..
H1B visa: అమెరికాలో మోసపూరిత మార్గాల్లో పౌరసత్వం పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అక్కడి న్యాయ శాఖ (DOJ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త నీరజ్ శర్మ (50) సహా మొత్తం 17 మంది పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు (డీనేచురలైజేషన్) చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించింది. వీసా మోసానికి సంబంధించిన కీలక వివరాలను దాచిపెట్టి, అబద్ధాలు చెప్పి ఆయన అమెరికా పౌరసత్వం పొందారని ఫెడరల్ అధికారులు కోర్టును ఆశ్రయించారు.
న్యూజెర్సీలో ‘మ్యాగ్నావిజన్ ఎల్ఎల్సీ’ పేరుతో ఐటీ కన్సల్టింగ్ మరియు స్టాఫింగ్ సంస్థను నడిపిన నీరజ్ శర్మ, 2015 ఏప్రిల్ నుంచి 2017 ఏప్రిల్ మధ్య కాలంలో 11 నకిలీ హెచ్-1బీ (H-1B) వీసా పిటిషన్లు దాఖలు చేసినట్టు ఫెడరల్ దర్యాప్తులో తేలింది. ఒక ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో ఐటీ నిపుణులకు ఉద్యోగాలు ఉన్నాయంటూ ఆయన తప్పుడు పత్రాలు సృష్టించారు. సదరు గ్లోబల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ల సంతకాలను ఫోర్జరీ చేసి, అధికారిక లెటర్హెడ్లపై నకిలీ సిఫార్సు లేఖలను దరఖాస్తులతో పాటు సమర్పించారని, వాస్తవానికి అక్కడ ఎలాంటి ఉద్యోగాలు లేవని అధికారులు గుర్తించారు. ఈ వీసా మోసం, పౌరసత్వ అక్రమాలపై నీరజ్ శర్మను 2019లో అరెస్ట్ చేయగా, విచారణ అనంతరం ఆయన కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో దోషిగా నిర్ధారించబడ్డారు.
న్యాయ శాఖ వాదన ప్రకారం, శర్మ ఈ వీసా మోసాలకు పాల్పడుతున్న సమయంలోనే, అంటే 2017లో అమెరికా పౌరసత్వం (నేచురలైజేషన్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, ప్రభుత్వ అధికారులకు ఎన్నడూ తప్పుడు సమాచారం లేదా పత్రాలు ఇవ్వలేదని, ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పలేదని ప్రమాణపూర్వకంగా పేర్కొన్నారు. ఈ అబద్ధాలను నిజమని నమ్మిన యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డిసెంబర్ 2017లో ఆయనకు పౌరసత్వం మంజూరు చేసింది. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసే నాటికే ఆయన క్రిమినల్ కార్యకలాపాల్లో ఉన్నారని, ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం పౌరసత్వ చట్టాల ప్రకారం తీవ్రమైన ఉల్లంఘనని న్యాయ శాఖ స్పష్టం చేసింది.
అమెరికా పౌరసత్వం అనేది ఒక విశిష్టమైన గౌరవమని, దానిని నిజాయితీతో మాత్రమే పొందాలని అధికారులు పేర్కొంటున్నారు. చట్టాలను ఉల్లంఘించి, వ్యవస్థను మోసం చేసిన వారికి ఆ అర్హత ఉండదనే ఉద్దేశంతోనే శర్మ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఫెడరల్ కోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. నీరజ్ శర్మతో పాటు లైంగిక వేధింపులు, ఆర్థిక మోసాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన మరో 16 మంది సహా మొత్తం 17 మందిపై అమెరికా ప్రభుత్వం ఈ డీనేచురలైజేషన్ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహారాలన్నీ కోర్టు పరిధిలో ఉండగా, ప్రభుత్వ ఆరోపణలను న్యాయస్థానంలో సవాలు చేసే హక్కు శర్మకు ఉంది. ఒకవేళ కోర్టులో నేరం పూర్తిగా రుజువై పౌరసత్వం రద్దయితే, వారు అమెరికా పౌరుడిగా లభించే రక్షణలను కోల్పోవడమే కాకుండా దేశ బహిష్కరణ (డీపోర్టేషన్) చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Tags
Be the first to react