సమాజం సజావుగా ముందుకు సాగాలంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ అవసరం..
ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే వారధిగా పత్రికా రంగం..
అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ అనేది ఒక ముఖ్యమైన స్తంభమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆయన పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజం సజావుగా ముందుకు సాగాలంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ అవసరమని అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, అసమానతలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తున్న పాత్రికేయుల సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే వారధిగా పత్రికా రంగం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. సమాచార యుగంలో వార్తల వేగం పెరిగినా, నిజ నిర్ధారణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన జర్నలిజం మరింత అవసరమని ఆయన సూచించారు.
అసత్య ప్రచారం, వదంతులు సమాజానికి హానికరమని హెచ్చరించిన మంత్రి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మీడియా ప్రధాన కర్తవ్యమని అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పాత్రికేయులు భయభ్రాంతులు లేకుండా తమ వృత్తిని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
చివరిగా, పత్రికా రంగం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని పేర్కొంటూ, నిజాయితీతో, ధైర్యంతో పనిచేస్తున్న పాత్రికేయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ హితానికి మీడియా మరింత బాధ్యతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.