తాత్కాలిక విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే పునరుద్దరించాలని ఆదేశం..
విద్యత్ సీఎండీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి..
రాష్ట్రంలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా విద్యుత్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ సీఎండీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, తాత్కాలికంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు ప్రజలకు ముందుగానే సమాచారం ఇవ్వడంతో పాటు, వాటిని త్వరగా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని గుర్తు చేశారు.
విద్యుత్ సరఫరా అందుబాటులో ఉన్నప్పటికీ ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయో మంత్రి ఆరా తీశారు. సమస్యల మూల కారణాలను గుర్తించి వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఇటీవల అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని తెలిపారు. అలాగే అకాల వర్షాల వల్ల కూడా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రికి వివరించారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే స్పందించి పరిష్కరించడం ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.