తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం..
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ..
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున చేరడంతో దర్శన సమయాలు గణనీయంగా పెరిగాయి.
ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు ATG గెస్ట్ హౌస్ వరకు లైన్లలో నిలబడి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు సుమారు 16 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.
₹300 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్లు తీసుకున్న వారికి కూడా 3 నుంచి 4 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.
నిన్న ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 91,005గా నమోదైంది. అదే రోజు 36,257 మంది భక్తులు తమ మొక్కులు నెరవేర్చుకుంటూ తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం కూడా గణనీయంగా ఉండగా, నిన్న రూ. 3.37 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
భక్తులు ఎంత కష్టమైనా సహనంతో స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తూ భక్తి భావంతో గడుపుతున్నారు. అధికారులు కూడా భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.