New Airport: ఏపీలో కొత్తగా ఎయిర్పోర్ట్... రూ.648 కోట్లతో నాలుగు జిల్లాలకు పండగే.. 2029నాటికి పూర్తి!
New Airport: ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం దాదాపు 1,376 ఎకరాల భూమిని సేకరించి సిద్ధంగా ఉంచింది. ఇందులో విమానాశ్రయ ప్రధాన రన్వే, టెర్మినల్ భవనాల నిర్మాణం కోసం 650 ఎకరాలను కేటాయించగా, మిగిలిన 726 ఎకరాలను కమర్షియల్ అవసరాల కోసం, విమానాశ్రయ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపయోగించనున్నారు.
-
వేగవంతమైన దగదర్తి ఎయిర్పోర్ట్ పనులు.. జూన్ 12న టెక్నికల్ బిడ్ల ఓపెనింగ్.
-
పీపీపీ పద్ధతిలో దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణం: 45 ఏళ్ల లీజుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
-
2029 నాటికి నెల్లూరు నుంచి విమాన ప్రయాణం: దగదర్తి తొలి దశకు సర్వం సిద్ధం.
New Airport: నెల్లూరు జిల్లాలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (APADCL) తో కలిసి ఈ విమానాశ్రయాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో నిర్మించేందుకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించింది. మొత్తం 648 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ మరియు ట్రాన్స్ఫర్ (DBFOT) విధానంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ టెండర్లలో విజేతగా నిలిచిన సంస్థకు 45 ఏళ్ల పాటు విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను అప్పగించేలా ప్రభుత్వం రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.
ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం దాదాపు 1,376 ఎకరాల భూమిని సేకరించి సిద్ధంగా ఉంచింది. ఇందులో విమానాశ్రయ ప్రధాన రన్వే, టెర్మినల్ భవనాల నిర్మాణం కోసం 650 ఎకరాలను కేటాయించగా, మిగిలిన 726 ఎకరాలను కమర్షియల్ అవసరాల కోసం, విమానాశ్రయ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపయోగించనున్నారు. జూన్ 12 లోగా ఆసక్తి గల పెద్ద సంస్థలు తమ బిడ్లను సమర్పించాల్సి ఉంటుంది. అదే రోజున టెక్నికల్ బిడ్లను ఓపెన్ చేసి, జూన్ 17న ఫైనాన్షియల్ బిడ్లను పరిశీలిస్తారు. టెండర్ ప్రక్రియ ముగిసిన కేవలం 15 రోజుల్లోనే ఎంపికైన సంస్థకు పనుల కేటాయింపు పత్రాన్ని ప్రభుత్వం అందజేయనుంది.
విమానాశ్రయ నిర్మాణాన్ని మొత్తం నాలుగు దశల్లో పూర్తి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మొదటి దశ పనులను 2028-2029 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేసి, విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం గడువుగా పెట్టుకుంది. ఆ తర్వాత ప్రయాణికుల రద్దీ మరియు అవసరాలను బట్టి 2070వ సంవత్సరం నాటికి మిగిలిన మూడు దశల విస్తరణ పనులను క్రమంగా పూర్తి చేస్తారు. మొదటి దశ పనులు పూర్తయిన తర్వాత రోజుకు సుమారు 2,282 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణించే అవకాశం ఉందని, రద్దీ సమయాల్లో ఒకేసారి 799 మందికి సేవలందించేలా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అలాగే రోజుకు కనీసం 27 విమానాల రాకపోకలకు వీలుగా రన్వేను సిద్ధం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇప్పటికే లభించడం విశేషం. రక్షణ శాఖ, హోం శాఖ, పౌర విమానయాన శాఖలతో పాటు పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ నుంచి కూడా క్లియరెన్స్ పత్రాలు రావడంతో పనులకు ఎలాంటి అడ్డంకులు లేవు. అంతేకాకుండా, ఈ విమానాశ్రయాన్ని చెన్నై-కోల్కతా జాతీయ రహదారి (NH-16) కి కలుపుతూ ప్రత్యేక లింక్ రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులకు రవాణా సౌకర్యం ఎంతో సులభతరం కానుంది.
దగదర్తి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు పొరుగునే ఉన్న ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల ప్రజల విమాన ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు, కృష్ణపట్నం పోర్టు ఆధారిత వ్యాపారాలు, ఆక్వా రంగానికి ఈ ఎయిర్పోర్ట్ పెద్ద రవాణా వెసులుబాటుగా మారనుంది. స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంత ఆర్థిక రూపురేఖలు మారతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Tags
1 readers have reacted