ప్రధాని మోదీ ఈ రాఖీ పర్వదినం సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే దిశగా కేంద్రం దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరగనున్న కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉంది. గతంలో కూడా రాఖీ సందర్భాన మోదీ మహిళల కోసం పలు సంక్షేమ నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
రేపు దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరగనున్న వేళ, గృహ వినియోగ ఎల్పీజీ ధర తగ్గింపు నిర్ణయం ఈ రోజు ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అమెరికా విధిస్తున్న సుంకాలు ప్రధాన చర్చాంశంగా ఉండనున్నాయి. సుంకాల విషయంలో మరింత వ్యూహాత్మక చర్యలకు మోదీ సిద్ధమవుతున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక, ఈసీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వంటి రాజకీయ అంశాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.
ప్రత్యేకంగా, రాఖీ సందర్భంలో వంట గ్యాస్ సిలిండర్లపై అదనపు రాయితీ ఇవ్వడానికి ప్రతిపాదనలు ముందుకు రానున్నాయి. ఎంత మేర తగ్గింపు ఇస్తే వినియోగదారులపై భారం తగ్గుతుందో, అలాగే కేంద్రం భరించాల్సిన ఆర్థిక భారం ఎంతవుతుందో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీన అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా ఎల్పీజీ రేట్లలో మార్పులు వస్తున్నాయి. గృహ వినియోగదారులపై భారం పడకుండా వాణిజ్య సిలిండర్లకే ధరలు పెంచుతుండగా, గృహ సిలిండర్లపై కేంద్రం రాయితీ ఇస్తోంది.
ఇక గతంలో రాఖీ గిఫ్ట్గా మోదీ ప్రభుత్వం ఉజ్వల యోజనా లబ్ధిదారులకు సిలిండర్పై రూ.200 రాయితీ ప్రకటించింది. ప్రస్తుతం కూడా ఈ రాయితీ కొనసాగుతోంది. అయితే, ఈసారి రాయితీ మొత్తాన్ని పెంచే అవకాశముందని, ఈ రోజు మధ్యాహ్నం జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుందని సమాచారం.