
పట్టణాల్లో అద్దె ఇళ్లలో నివసించే లక్షలాది మంది కోసం పెద్ద షాక్ వచ్చింది. ఇప్పటివరకు ఫోన్పే, పేటీఎం, క్రెడ్ వంటి ఆన్లైన్ పేమెంట్ యాప్ల ద్వారా క్రెడిట్ కార్డ్లతో సులభంగా అద్దె చెల్లించుకునే సౌకర్యం ఉండేది. కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా జారీ చేసిన నిబంధనల వల్ల ఆ సేవ నిలిచిపోయింది. ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం పేమెంట్ అగ్రిగేటర్లు, గేట్వేలు కేవలం అధికారికంగా నమోదు చేసుకున్న వ్యాపారుల ట్రాన్సాక్షన్లను మాత్రమే ప్రాసెస్ చేయాలి. కానీ ఎక్కువ మంది ఇల్లు యజమానులు వ్యాపారులుగా నమోదు కానందున, ఈ కొత్త నిబంధన కారణంగా ఫిన్టెక్ యాప్లు క్రెడిట్ కార్డ్ అద్దె చెల్లింపులను నిలిపివేశాయి.
ఇది ఒక్క రిజిస్ట్రేషన్ సమస్యే కాదు. ఆర్బీఐకి మరో ప్రధాన ఆందోళన KYC (Know Your Customer) నిబంధనలపై ఉంది. కొంతమంది వినియోగదారులు క్రెడిట్ కార్డ్ అద్దె చెల్లింపు ఫీచర్ను వాడుకుని, డబ్బును బంధువుల ఖాతాలకు బదిలీ చేసి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని గుర్తించారు. దీని వల్ల అసలు అద్దె లావాదేవీ కాదని తేలింది. పూర్తి స్థాయి ధృవీకరణ లేకుండా డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఆర్బీఐ అడ్డుకోవాలని నిర్ణయించింది. ఈ కారణంగానే ఈ ఫీచర్ పూర్తిగా ఆగిపోయింది.
గత కొన్నేళ్లలో క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపు ఒక పెద్ద ట్రెండ్గా మారింది. ప్రతి నెలా అధిక మొత్తంలో అద్దె చెల్లించడం వల్ల రివార్డ్ పాయింట్లు, క్యాష్బ్యాక్ లభించడం వినియోగదారులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదనంగా, వడ్డీ లేకుండా కొన్ని వారాల గ్రేస్ పీరియడ్ కూడా లభించేది. ఆన్లైన్ యాప్ల ద్వారా సులభంగా చెల్లింపులు చేయడం వల్ల ఈ పద్ధతి బాగా పాపులర్ అయింది. అయితే ఇప్పటికే కొన్ని బ్యాంకులు కూడా అద్దె చెల్లింపులపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1% ఛార్జీ వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ వంటి బ్యాంకులు అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను నిలిపివేశాయి.
ఇకపై క్రెడిట్ కార్డ్ అద్దె చెల్లింపులు పూర్తిగా ఆగిపోవడంతో ప్రజలకు ఒక్కటే మార్గం మిగిలింది. నేరుగా బ్యాంక్ ట్రాన్స్ఫర్, యూపీఐ పేమెంట్ లేదా పాత పద్ధతిలో క్యాష్, చెక్ ద్వారా అద్దె చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త రూల్స్ వల్ల అద్దెదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ముఖ్యంగా రివార్డ్ పాయింట్లు, క్యాష్బ్యాక్లను ఆశించే క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఇది నిరాశ కలిగించే పరిణామం. అయినప్పటికీ, ఆర్బీఐ ఉద్దేశం మాత్రం స్పష్టం – డబ్బు లావాదేవీల్లో పారదర్శకత, నిబంధనల ప్రకారం మాత్రమే లావాదేవీలు జరగాలి.