దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ సేవలను వినియోగించే వారికి తపాలా శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత స్పీడ్ పోస్ట్ చార్జీలను సవరించామని, పెరిగిన రేట్లు ఈ అక్టోబర్ 1వ తేదీ (బుధవారం) నుంచి అమల్లోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. చివరిసారిగా 2012లో రేట్లు మార్చిన తర్వాత నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిందని, అదే కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అయితే కేవలం ధరల పెంపే కాకుండా, వినియోగదారులకు సౌలభ్యాన్ని, భద్రతను పెంచే పలు ఆధునిక సదుపాయాలను కూడా ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నామని తపాలా శాఖ వివరించింది.
స్పీడ్ పోస్ట్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రధాన మార్పుల్లో ఒకటి ఓటీపీ ఆధారిత డెలివరీ. ఇకపై పార్సిల్ అందుకోవాలంటే ఆన్లైన్ షాపింగ్ సంస్థల మాదిరిగానే వినియోగదారుడు పోస్ట్మ్యాన్కు ఓటీపీ చెప్పాలి. ఈ విధానం ద్వారా భద్రతతో కూడిన పార్సిల్ డెలివరీ సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక సేవను పొందాలనుకునే వారు అదనంగా రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, పార్సిల్ బుకింగ్ సమయంలోనే ఆన్లైన్లో చెల్లింపు చేసే సదుపాయం, డెలివరీ వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో పొందడం, రియల్ టైమ్ డెలివరీ అప్డేట్లు తెలుసుకోవడం వంటి సౌకర్యాలను కూడా తపాలా శాఖ ప్రవేశపెట్టింది.
అంతేకాదు, ‘రిజిస్ట్రేషన్ సర్వీస్’ అనే కొత్త సదుపాయాన్ని కూడా ప్రారంభించింది. దీనికి అదనంగా రూ.5 చెల్లించడం ద్వారా వినియోగదారుడు సూచించిన వ్యక్తికే, నిర్దిష్ట చిరునామాలోనే పార్సిల్ చేరేలా చూడనున్నారు. ఈ చర్యతో పార్సిల్ తప్పు వ్యక్తుల చేతిలో పడే అవకాశాలు తగ్గుతాయని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ఈ సేవలు మరింత వేగవంతం అవుతాయని, గ్రామీణ ప్రాంతాలకూ సమానంగా చేరతాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే పెరుగుతున్న ధరలతో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోస్టల్ శాఖ భరోసా ఇస్తోంది. ముఖ్యంగా విద్యార్థులకు ఊరటనిచ్చేలా స్పీడ్ పోస్ట్ చార్జీలపై 10 శాతం రాయితీని ప్రకటించింది. చదువుతో సంబంధమున్న పత్రాలను పంపే సమయంలో ఈ రాయితీ వర్తించనుంది. దీంతో విద్యార్థులకు భారం తగ్గుతుందని అధికారులు చెప్పారు. మొత్తంగా ఈసారి స్పీడ్ పోస్ట్ సేవల్లో వచ్చిన మార్పులు కేవలం ధరల పెంపుకే పరిమితం కాకుండా, వినియోగదారుల భద్రత, సౌలభ్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయని పోస్టల్ శాఖ స్పష్టంచేసింది.