ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా కప్ను కైవసం చేసుకుంది. ఆదివారం పాకిస్థాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచి 9వ సారి ఆసియా కప్ టైటిల్ను అందుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజేయ హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఫర్హాన్ 57 పరుగులు, ఫకర్ జమాన్ 46 పరుగులు చేసి కొంత మెరుగ్గా ఆడారు. అయితే మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు దక్కించుకుని పాకిస్థాన్ బ్యాటింగ్ను పూర్తిగా కుదిపేశారు.
లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభం దారుణంగా సాగింది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ కష్ట సమయంలో తిలక్ వర్మ, సంజూ శాంసన్ జట్టు ఇన్నింగ్స్ను నిలబెట్టారు. సంజూ శాంసన్ 24 పరుగులు చేయగా, తిలక్ వర్మ సిక్స్లు, ఫోర్లతో రాణించాడు.
శివమ్ దూబే బ్యాటింగ్లోకి వచ్చి తిలక్కు అండగా నిలిచాడు. వీరిద్దరి భాగస్వామ్యం భారత్కు ఊపిరి పీల్చేలా చేసింది. తిలక్ వర్మ 41 బంతుల్లో అద్భుత హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. శివమ్ దూబే 33 పరుగులు చేసి మంచి మద్దతు ఇచ్చాడు. చివరి ఓవర్లలో ఇద్దరూ కలిసి స్కోరును ముందుకు నెట్టారు.
చివరి 2 ఓవర్లలో భారత్కు 17 పరుగులు కావాల్సి వచ్చింది. శివమ్ దూబే బౌండరీలు బాదినా, చివర్లో ఔటయ్యాడు. ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరమైనప్పుడు తిలక్ వర్మ సిక్స్ కొట్టాడు. అనంతరం రింకూ సింగ్ బౌండరీ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ గెలుపుతో టీమిండియా మరోసారి ఆసియా కప్ కిరీటం దక్కించుకుంది. పాకిస్థాన్తో ఈ టోర్నీలో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్తో మ్యాచ్ హీరోగా నిలిచి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు.