ఆంధ్రప్రదేశ్లో పాలనా యంత్రాంగంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల ముందు బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని సంకల్పించినట్లు సమాచారం. ఈ మేరకు గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలు నిర్వహించగా, ఆదివారం కూడా ఉన్నతాధికారులతో కలిసి విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. మొదటి విడత బదిలీల జాబితా దాదాపుగా ఖరారవగా, వచ్చే రెండు మూడు రోజుల్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రాథమికంగా బదిలీల జాబితాలో శాఖాధిపతులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నట్లు తెలిసింది. అంతేకాక, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), విద్యుత్ పంపిణీ సంస్థలు వంటి కీలక విభాగాల్లోనూ మార్పులు తప్పవని భావిస్తున్నారు. పనితీరు ఆధారంగా ఇప్పటికే కలెక్టర్లపై రెండు–మూడు విడతలుగా గోప్యంగా సమాచారం సేకరించి, వాటిని పరిశీలించి తుది జాబితా రూపొందించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, కొన్ని పథకాల అమలులో లోపాలు, కార్యదర్శుల పనితీరు వంటి అంశాలనూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
ఈ మార్పుల ప్రక్రియ సచివాలయం స్థాయి అధికారుల బదిలీలతో ప్రారంభమై, ఆపై జిల్లాల వరకు విస్తరించనున్నట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందు అన్ని బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పాలనా యంత్రాంగంలో పెద్ద ఎత్తున చలనం రానుందని భావిస్తున్నారు.