ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2025లో క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆగస్టు 21తో ముగిసింది. అయితే తాజాగా ఐబీపీఎస్ మరో ప్రకటన విడుదల చేస్తూ దరఖాస్తుల గడువును ఆగస్టు 28, 2025 వరకు పొడిగించింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు మరోసారి అవకాశం లభించింది. ఈ నోటిఫికేషన్ కింద దేశవ్యాప్తంగా మొత్తం 10,277 క్లర్క్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో తెలంగాణకు 261 పోస్టులు, ఆంధ్రప్రదేశ్కు 367 పోస్టులు కేటాయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటం తప్పనిసరి. అలాగే స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వయోపరిమితి ఆగస్టు 1, 2025 నాటికి 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిలో సడలింపుగా, ఓబీసీ వర్గానికి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వరకూ అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175, ఇతర అభ్యర్థులకు రూ.850గా నిర్ణయించారు. అధికారులు చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు రాకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పరీక్షా షెడ్యూల్: ఆన్లైన్ దరఖాస్తుల తుది గడువు: ఆగస్టు 28, 2025. ప్రిలిమ్స్ రాత పరీక్ష: అక్టోబర్ 4, 5, 11 మెయిన్స్ రాత పరీక్ష: నవంబర్ 29, 2025