రాష్ట్ర సచివాలయంలో డిసెంబర్ 18, 2025న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో “స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” అంశంపై సమగ్రంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో నోడల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శ్రీ పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వర్ణ ఆంధ్ర విజన్ను వివరించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను సంపూర్ణ అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూపొందించిన ఈ పది సూత్రాలు రాష్ట్ర పాలనకు దిశానిర్దేశకంగా ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు.
“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు”లో పేదరహిత ఆంధ్ర (P4), నైపుణ్యాభివృద్ధి & ఉపాధి కల్పన, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ–టెక్నాలజీ సమన్వయం, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ వ్యవస్థ, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, అలాగే దీప్టెక్ వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ పది సూత్రాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, రూ.55 లక్షల తలసరి ఆదాయం, జీరో పావర్టీ, 100 శాతం అక్షరాస్యత, అలాగే 85 సంవత్సరాల ఆయుర్ధాయం కలిగిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు.
జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం P4 (Public–Private–People Partnership) మోడల్ను అమలు చేస్తోంది. ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి యూనిట్గా మార్చాలనే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఉగాది సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం కింద బంగారు కుటుంబాలు, మార్గదర్శులను గుర్తించేందుకు మార్చి, జూలై నెలల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించారు. ఇందులో భాగంగా 21 లక్షల కుటుంబాలను షార్ట్లిస్ట్ చేయగా, వాటిలో 10 లక్షల బంగారు కుటుంబాలు, లక్ష మంది మార్గదర్శులను గుర్తించారు. ఈ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు పటిష్టమైన పునాది వేయబడుతోందని అధికారులు తెలిపారు.
**Family Benefit Management System (FBMS)**లో ఇప్పటికే 1.02 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు కాగా, 1.40 లక్షల కుటుంబాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించబడ్డాయి. డిసెంబర్ 2025 నాటికి 72 శాతం డేటా సాట్యురేషన్ సాధించగా, మార్చి 2026 నాటికి 90 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో దాదాపు 10 లక్షల బంగారు కుటుంబాలు టైఅప్ అయ్యేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు కీలక పాత్ర పోషించాలని, జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. GSWS–బంగారు కుటుంబం అనుసంధానం ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సమాన అవకాశాలు, డేటా ఆధారిత పాలన సాధ్యమవుతాయని, ఇది స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు బలమైన ఆధారంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.