తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం గురువారం రాజకీయ చర్చలతో కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘కాఫీ కబుర్లు’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొని మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో నేరుగా మాట్లాడారు. పార్టీకి కొత్త దిశను, శిక్షణ పద్ధతులకు మరింత శక్తివంతమైన రూపాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సమావేశం సాగింది.
చంద్రబాబు ప్రారంభంలోనే గతంలో పార్టీ శిక్షణల పరిస్థితులను గుర్తుచేశారు. “ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద, ఎండలో కూర్చొని శిక్షణలు తీసుకునేవాళ్లం. ఏసీలు, హాల్లు, సౌకర్యాలు అన్నవి అప్పట్లో ఊహ కూడా కాదు. ఇప్పుడు సమయం మారింది… పనిమార్గాలు కూడా మారాలి” అని ఆయన చెప్పారు. ఆధునిక రాజకీయాల్లో నాయకులు తమ నాయకత్వాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ప్రతి కార్యకర్తకు పార్టీ సిద్ధాంతాలు, ఆత్మీయత, భావజలం స్పష్టంగా తెలియాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు “పార్టీని నిలబెట్టేది కార్యకర్తలే. వారి ఆలోచనలు, వారి క్రమశిక్షణే మన బలం” అని ఆయన గుర్తుచేశారు. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ప్రజలతో సంభాషణ మరింత సులభమైందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా చేపట్టుతున్న సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఆయన వివరించారు. అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి, తల్లికి వందనం వంటి పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికే లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా మహిళల ఓటు బ్యాంక్ ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ, దానిని కాపాడే బాధ్యత నేతలపై ఉందని సూచించారు.
ప్రతి పోలింగ్ బూత్లో బలాబలాలు అంచనా వేసి, బూత్ వారీగా బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. “ఎక్కడ సమర్థ నాయకత్వం ఉంటే అక్కడ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయి. బలహీన ప్రాంతాన్ని మంచి నాయకుడు బలపరుస్తాడు. కానీ బలహీన నాయకుడికి బలమైన నియోజకవర్గం ఇచ్చినా అది బలహీనమే అవుతుంది” అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
2019 నుంచి 2024 మధ్య రాష్ట్రవ్యవస్థపై జరిగిన విషయాలు గురించి మాట్లాడుతూ, “ప్రణాళికలు, వ్యవస్థలు చెదిరిపోయాయి. వాటిని మళ్లీ గాడిలో పెట్టాం. ఇప్పుడు ప్రతి విభాగం ప్రజల కోసం పనిచేసే స్థితిలోకి వచ్చింది” అని అన్నారు. పింఛన్లకే ఏటా రూ.33 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, ఇది సామాజిక భద్రతకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమని తెలిపారు.
ఎన్నికల రాజకీయాలపై మాట్లాడిన చంద్రబాబు, “డబ్బు పెడితే ఎన్నిక గెలుస్తాం అన్న భావన తప్పు. మనం చేసే పనులు, ప్రజల మీద మన నమ్మకం ఇవే ఎన్నికల్లో గెలిపిస్తాయి. పని చేయడం ఒక వైపు… చేసిన పనిని ప్రజలకు చేరవేయడం మరో ముఖ్యమైన పని” అని అన్నారు.
సమావేశం మొత్తం వ్యవస్థపరమైన మార్పులు, రాజకీయ శిక్షణ, మరియు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘కాఫీ కబుర్లు’ పేరుతో చంద్రబాబు చేపట్టిన ఈ ఇంటరాక్షన్ కార్యక్రమం రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాల్లో కూడా కొనసాగనుంది.