అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పోతిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన నక్కా వెంకట రమణ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ తాత కురిమిని యల్లయ్య రెడ్డి (స్వాతంత్ర సమరయోధుడు) పేరుపై గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.473/1, 473/2లో 13 సెంట్ల గ్రామ కంఠం భూమి, తాలూకు ఇల్లు ప్రభుత్వమే ఇచ్చింది.
తమ తాత 1990లో మరణించారు. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తన తాత ఇంటిని కూల్చివేసి అక్రమంగా నిర్మాణం చేపట్టి సర్వే నెం.320గా చూపించి భూమిని కబ్జా చేశారు. తాత పేరు మీద ఉన్న 1బి, అడంగల్, ఖాతా నెం.20000301 వంటి పత్రాలతో తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసి వెరిఫికేషన్ పూర్తయ్యిందని చలానా రూ.650 చెల్లించినా రసీదు ఇవ్వలేదు.
అక్రమంగా నిర్మించిన స్థలాన్ని గ్రామ మాజీ కౌన్సిలర్ కాళ్ళ సత్యనారాయణ ద్వారా ఇతరులకు విక్రయించారు. దీనిపై ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని నేతలు కార్మిక, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ సీడప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డిలకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.
విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన సీత గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..గత ప్రభుత్వంలో మాజీ ఆర్పీ బైరెడ్డి గోవిందమ్మ ఎస్ఎల్ఎఫ్ నిధులను దుర్వినియోగం చేసి గ్రూప్ డబ్బులు బ్యాంకులకు కట్టలేదు.
ఈ ఆరోపణలతో ఆమెను తొలగించినప్పటికీ జిల్లా జెడ్పీ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు సిఫారసుతో, పీడీ, సీఎంఎం అధికారులు రూ.2 లక్షల లంచంతో 14-11-2025న మళ్లీ ఆర్పీగా నియమించారు. దీనిపై 17-11-2025న కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి, గోవిందమ్మపై చర్యలు తీసుకుని నష్టపోయిన మహిళలకు న్యాయం చేయాలని కోరారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన పుల్లయ్య నాయుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. రావుపాలెం గ్రామానికి చెందిన చెన్నం నాగవేణు వెంకట సత్యనాయణరెడ్డి అనే వ్యక్తికి భూమి విక్రయం కొరకు రూ.6 లక్షల తీసుకొని మోసం చేశాడు.
తాము ఇచ్చిన డబ్బుకు అగ్రిమెంట్ రాస్తానని చెప్పి ఇప్పటి వరకు వ్రాయలేదు. గత ప్రభుత్వంలో అతను వైసీపీ నాయకుడు కావడంతో బెదిరించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
అనంతపురము జిల్లా పామిడి మండలం కత్రిమల గ్రామానికి చెందిన పెన్నోబిలేసు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో తమకు సర్వే నెం.154లో ఎ.1–84 సెంట్ల ప్రభుత్వ భూమిని గత 13 సంవత్సరాలుగా సాగు చేస్తున్నాం. అయితే అదే భూమికి కోనేపల్లి తాండ గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ పేరు మీద పొరపాటుగా పాస్బుక్కులు మంజూరయ్యాయి.
ఈ విషయం ఈశ్వరమ్మ స్వయంగా ఎంఆర్ఓ కార్యాలయంలో చెప్పి భూమి తనది కాదని పేరుమార్పు చేయాలని కోరినా అధికారులు ఇప్పటివరకు సరిచేయలేదు. కావున తమయందు దయవుంచి వారిపై చర్యలు తీసుకోని ఆ భూమి తన పేరుమీద ఆన్లైన్ నమోదు చేసి న్యాయం చేయాలని కోరాడు.
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బ్రహ్మయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వేనెం. 15/5 లో య. 1-12 సెంట్ల భూమి తమ పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వచ్చింది.
అయితే గ్రామానికి చెందిన అనుమల సాంబయ్య, అనుమల కోటేష్, అనుమల సుధా, అనుమల సురేష్ అనే వారు తనను పొలంలోకి వెళ్లనివ్వకుండా బెదిరిస్తూ ట్రాక్టర్ డ్రైవర్లను కూడా భయపెట్టి సాగును అడ్డుకుంటున్నారు. దీనిపై తహసీల్దార్ కు, స్థాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన రామసుబ్బమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..వి.పి.ఆర్ కండ్రిక మజరా కన్నెగుంట గ్రామానికి సమీపంలో ఉన్న సర్వే నెం.204/1 (య.6.00 ఎకరాలు) భూమిని దస్తావేజు నెం.1907/92 (28-12-1992) ద్వారా కొనుగోలు చేసినప్పటికీ కన్నెగుంట గ్రామస్తుడు మేకల పోలయ్య అక్రమంగా సుమారు 2 ఎకరాలు ఆక్రమించారు.
ఈ భూమి స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో మంజూరైన పట్టా ఆధారంగా తమకు చట్టబద్ధ హక్కులున్నాయి. 2019–2021లో సర్వే ఫీజులు చెల్లించినా సర్వే జరగలేదు. అన్ని పత్రాలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అన్యాయం జరుగుతోందన్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంకు చెందిన నక్కా బాలకృష్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..విశాఖ జిల్లా గాజువాక మండలంలో 1995 సంవత్సరంలో తాము కొనుగోలు చేసిన స్థలం కబ్జాకు గురి అయింది. ఆ స్థలాన్ని S.T.B2 సంస్థకు చెందిన బాలాజీ అనే వ్యక్తి ఆక్రమించాడు. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో నివసించి పదవీ విరమణ అనంతరం స్థలానికి వెళ్లగా స్థలంలోకి అనుమతించడం లేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
అనంతపురము జిల్లా గార్లదిన్నె మండలం పెనకచెర్ల కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎక్కలూరి హరేరామ్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో తమ తండ్రి పేరిట సర్వే నెం.145-2లో 5.00 ఎకరాల భూమిని ప్రభుత్వం డి-ఫారం పట్టా మంజూరు చేసింది. తండ్రి మృతిచెందిన తర్వాత గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అక్రమంగా భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నాడు.
ఈ విషయమై తహశీల్దారుకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా, తమకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పు కాఫీలు కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దారులకు అందజేశామన్నారు. అయినప్పటికీ అధికారులు అమలు చేయడంలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన శివరామమూర్తి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ధాన్యం సంబంధిత మొత్తం రూ.1,52,000 తన ప్రమేయం లేకుండానే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (A/c No. 3516) నుండి యూనియన్ బ్యాంక్ ఇతర వ్యక్తి ఖాతాలకు తప్పుగా ట్రాన్స్ఫర్ అయ్యాయి.
ఈ విషయంలో పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. కావున సంబంధిత బ్యాంకులపై అధికారులు విచారణ జరిపి తప్పుగా బదిలీ అయిన ధాన్యం డబ్బులు తన ఖాతాలోకి తిరిగి జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.