ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన A.U. సెంటెనరీ అలుమ్ని మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ముగ్గురు విశిష్ట అలుమ్నిలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ అలుమ్నిగా గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని, సాగునీటి శాఖలో చీఫ్ ఇంజినీర్గా సేవలందించిన శ్రీ బి. బ్రహ్మానయ్య గారిని, అలాగే విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే, ఎస్వీసీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్న శ్రీ పి. విష్ణు కుమార్ రాజు గారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను సభాప్రాంగణం ఘనంగా ప్రశంసించింది.
అనంతరం సభను ఉద్దేశించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ..ఆంధ్రా యూనివర్సిటీ దేశానికి గొప్ప ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, పరిపాలనాధికారులను అందించిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా నిలిచిందన్నారు. ముఖ్యంగా సివిల్ ఇంజినీరింగ్ విభాగం రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధికి వెన్నెముకగా మారిందని పేర్కొన్నారు. అలుమ్ని–వర్సిటీ అనుబంధం బలపడితే విద్యార్థులకు పరిశ్రమలతో అనుసంధానం పెరిగి ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు.
గత జగన్ రెడ్డి హయాంలో విశ్వవిద్యాలయాల స్వతంత్రత దెబ్బతిన్నదని విమర్శించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రా యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో కూడా రాజకీయాలను ప్రవేశపెట్టి అకడమిక్ వాతావరణాన్ని కలుషితం చేశారని మండిపడ్డారు. విద్యాలయాలు జ్ఞానం, పరిశోధనకు కేంద్రాలుగా ఉండాల్సి ఉండగా, పార్టీ రాజకీయాల ప్రభావానికి లోనవడం రాష్ట్ర విద్యా ప్రతిష్ఠకు తీరని నష్టం చేసిందన్నారు.
దీనికి భిన్నంగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ విద్యా సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని పల్లా గారు స్పష్టం చేశారు. విద్యను రాజకీయాల నుంచి పూర్తిగా వేరు చేసి, అకడమిక్ స్వతంత్రతకు గౌరవం ఇస్తూ, విద్య–నైపుణ్య–ఉపాధి అనుసంధానానికి స్పష్టమైన రోడ్మ్యాప్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు. విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచే దిశగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తాయన్నారు.
యువత శాస్త్రీయ దృక్పథం, నైతిక విలువలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని పల్లా గారు సూచించారు. విజనరీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్య ద్వారా ఉపాధి సృష్టే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా, విద్యా విలువల పునరుద్ధరణకు దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షించారు.