ఆంధ్రప్రదేశ్లో గ్రామస్థాయి పరిపాలన వ్యవస్థలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ప్రభుత్వం ఆకస్మికంగా బ్రేక్ వేసింది. ఇప్పటికే విడుదలైన నిధులను కూడా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వినియోగించవద్దని అధికారులకు స్పష్టమైన సూచనలు వెళ్లినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గ్రామాభివృద్ధి పనులకు కీలకంగా ఉపయోగపడే 15వ ఆర్థిక సంఘం నిధులపై స్థానిక సంస్థల ప్రతినిధులు భారీ ఆశలు పెట్టుకున్నారు. రోడ్లు, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కోసం ఈ నిధులు ఎంతో అవసరం. అయితే ఇప్పుడు వాటిని వినియోగించకుండా నిలిపివేయాలన్న ఆదేశాలు రావడంతో పలు అభివృద్ధి పనులు అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పనులు ప్రారంభమైనా, బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో, చివరి దశలో నిధుల దుర్వినియోగం జరిగే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల పాత పనుల పేరుతో బిల్లులు క్లియర్ చేయాలని అధికారులు, కార్యదర్శులపై ఒత్తిడి పెరిగిందని సమాచారం. మరికొన్ని ప్రాంతాల్లో చేయని పనులకూ బిల్లులు తయారు చేస్తున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అప్రమత్తమైంది. జిల్లాల వారీగా జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉన్నతాధికారులు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. కొత్తగా ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని, ప్రభుత్వం నుంచి తదుపరి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే వరకు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.
ఈ నిర్ణయం గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల్లో ఆందోళనకు కారణమవుతోంది. తమ పదవీకాలం ముగింపు దశలో ఉండగా, గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ప్రశ్నలు అడుగుతున్నారని, కానీ నిధులు వాడకుండా ఆపేశారని పలువురు సర్పంచులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం నిధుల పారదర్శక వినియోగమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంకేతాలు ఇస్తోంది.
ప్రస్తుతం ఈ నిధుల వ్యవహారం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు ఎప్పుడు వస్తాయన్నదానిపై స్పష్టత లేకపోవడంతో గ్రామస్థాయి పరిపాలనలో అనిశ్చితి నెలకొంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, నిధుల వినియోగంపై ఏవిధమైన మార్గదర్శకాలు జారీ చేస్తుందో అన్నదానిపై సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.