Tourism: పాపికొండల పర్యాటకంపై పులి ప్రభావం.. భయంతో తగ్గిన సందర్శకుల రద్దీ!
Tourism: పాపికొండల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి స్థానిక గిరిజన గ్రామాల్లోనే కాకుండా పర్యాటక రంగంపైనా ప్రభావం చూపుతోంది. గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలో తిరుగుతున్న పులి కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, పాపికొండలకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
పులి భయంతో పాపికొండల్లో వెలవెలబోతున్న పర్యాటక ప్రాంతాలు..
గండి పోచమ్మ ఆలయ మార్గం మూసివేత.. భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు..
పోలవరం: పాపికొండల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి స్థానిక గిరిజన గ్రామాల్లోనే కాకుండా పర్యాటక రంగంపైనా ప్రభావం చూపుతోంది. గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలో తిరుగుతున్న పులి కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, పాపికొండలకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
అటవీశాఖ అధికారుల సమాచారం ప్రకారం, పులి పరగసానిపాడు, కుడిపల్లి, బొడిగూడెం గ్రామాల పరిసరాల్లో కనిపించింది. దీంతో దేవీపట్నం సమీపంలోని ప్రసిద్ధ గండి పోచమ్మ ఆలయానికి వెళ్లే రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ నిర్ణయంతో ఆలయాన్ని సందర్శించే భక్తులతో పాటు పాపికొండలకు వచ్చే పర్యాటకుల రాక కూడా తగ్గిపోయింది.
పులి సంచారం కొనసాగుతుండటంతో స్థానిక గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. గ్రామాల పరిసరాల్లో రాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, పులిని బంధించేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గురువారం అర్ధరాత్రి వరకు అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు నిర్వహించినప్పటికీ పులిని పట్టుకోవడంలో విజయం సాధించలేకపోయారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆపరేషన్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు.
పులి కదలికలను గుర్తించేందుకు రేడియో కాలర్ సాంకేతికతతో పాటు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. హనుమాన్ బృందాలు, వన్యప్రాణి నిపుణులు, అటవీశాఖ ఉన్నతాధికారుల సమన్వయంతో పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
పర్యాటకులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు. పులిని త్వరలోనే పట్టుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Be the first to react