Prajavedhika: మాజీ మంత్రి బంధువుపై గ్రీవెన్స్లో భూ కబ్జా ఫిర్యాదు.... వెబ్ల్యాండ్ సాంకేతిక లోపాలతో దొంగ పాస్ పుస్తకాలు.... బాధితులకు మంత్రి నారాయణ భరోసా!
Prajavedhika: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ-సర్వే విధానం మరియు ఆన్లైన్ రికార్డుల లోపాల వల్ల తాము నష్టపోయామంటూ పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన రావిపాటి లక్ష్మీనారాయణ తన ఐదెకరాల సొంత భూమి రికార్డులు ముందస్తు సమాచారం లేకుండా ఆన్లైన్ నుంచి మాయమయ్యాయని మంత్రికి వివరించాడు.
-
రీ-సర్వే తెచ్చిన తంటా.. ఆన్లైన్ రికార్డుల నుంచి ఐదెకరాల సొంత భూమి మాయం!
-
దళిత మహిళ భూమి ఆక్రమణ.. న్యాయం అడిగితే కులం పేరుతో దూషణలు, దాడులు
-
25 లక్షల దొంగతనం జరిగితే FIRలో 2 లక్షలే.. పిడుగురాళ్ల పోలీసుల తీరుపై బాధితుడి ఆవేదన
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రజా సమస్యల కోలాహలంతో సందడిగ మారింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు సమక్షంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ (గ్రీవెన్స్) కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా భూ కబ్జాలు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అక్రమ వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలు మరియు పోలీస్ స్టేషన్లలో ఎదురవుతున్న ఇబ్బందులపై బాధితులు కన్నీరుమున్నీరవుతూ మంత్రులకు తమ అర్జీలను సమర్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఈ వినతుల స్వీకరణలో రాజకీయ పలుకుబడి కలిగిన వారి భూ అక్రమాలపై ప్రధానంగా ఫిర్యాదులు వచ్చాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు బంధువు అంబటి వెంకటేశ్వరరావు బాపట్ల జిల్లాలో ఓ మహిళకు చెందిన పట్టా భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడని, దీనిపై నిలదీస్తే దాడికి పాల్పడ్డారని బాధితురాలు సామ్రాజ్యం ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీదేవి అనే దళిత మహిళ తమ సాగు భూమిని కొందరు దౌర్జన్యంగా లాక్కున్నారని, న్యాయం అడిగితే కులం పేరుతో దూషించారని వాపోయింది. విజయవాడకు చెందిన ఆనంద్ హర్ష అనే వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం చేసిన ఆరున్నర లక్షల అప్పుకు గాను వడ్డీ వ్యాపారి ఏకంగా 39 లక్షలు డిమాండ్ చేస్తూ తన భూమిని కబ్జా చేశాడని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఫిర్యాదు చేశాడు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ-సర్వే విధానం మరియు ఆన్లైన్ రికార్డుల లోపాల వల్ల తాము నష్టపోయామంటూ పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన రావిపాటి లక్ష్మీనారాయణ తన ఐదెకరాల సొంత భూమి రికార్డులు ముందస్తు సమాచారం లేకుండా ఆన్లైన్ నుంచి మాయమయ్యాయని మంత్రికి వివరించాడు. పల్నాడు జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి కూడా తమ గ్రామంలోని కొందరు రైతుల భూములను రికార్డుల నుండి తొలగించారని, సత్యసాయి జిల్లాకు చెందిన వెంకటరమణ వెబ్ల్యాండ్ సాంకేతిక లోపాల ఆధారంగా కొందరు దొంగ పాస్ పుస్తకాలు సృష్టించారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాకు చెందిన కోటిరెడ్డి తన భూమి ఆన్లైన్ ఫైల్ నాలుగు నెలలుగా కలెక్టర్ లాగిన్లో పెండింగ్లో ఉందని ఆవేదన చెందాడు.
భూమి సమస్యలతో పాటు శాంతిభద్రతలు, పోలీసుల నిర్లక్ష్యంపై కూడా పలువురు బాధితులు గళమెత్తారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బియ్యం వ్యాపారి ఆంజనేయులు తన ఇంట్లో 25 లక్షల విలువైన సొత్తు దొంగతనం జరిగితే, పోలీసులు ఎఫ్ఐఆర్లో కేవలం రెండున్నర లక్షలు మాత్రమే రాసి కేసును పక్కనబెట్టారని ఫిర్యాదు చేశాడు. కడపకు చెందిన రమాదేవి అనే మహిళ తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఇతర రాష్ట్ర వ్యక్తి అక్రమంగా చికెన్ దుకాణం పెట్టి, ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని, కొందరు పోలీసులు కూడా అతనికే మద్దతు ఇస్తున్నారని తెలిపింది. నంద్యాల జిల్లాకు చెందిన ఇంద్రావతి తప్పుడు రిజిస్ట్రేషన్లతో తన స్థలాన్ని ఆక్రమించి రౌడీయిజం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో కేవలం దౌర్జన్యాలు, భూ సమస్యలే కాకుండా సామాన్య ప్రజల నిత్యజీవిత అవసరాలకు సంబంధించిన వినతులు కూడా వెల్లువెత్తాయి. ఇళ్ల స్థలాలు, కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు కోసం వృద్ధులు, పేదలు పెద్ద సంఖ్యలో అర్జీలు ఇచ్చారు. అలాగే ఉపాధి కోసం నిరుద్యోగ యువతీ యువకులు తమ రెస్యూమ్లను మంత్రులకు అందజేయగా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు బాధితులు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. వినతులన్నింటినీ ఓపికగా పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ, అర్జీలను వెంటనే సంబంధిత శాఖల అధికారులకు పంపి, బాధితులకు త్వరితగతిన పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Be the first to react