Kakinada: కాకినాడలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
Kakinada: కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన జరిగింది. పోలీసు దళాల నుంచి ఉప ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా వేడుకల్లో పాల్గొన్నారు.
దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి పాత్ర కీలకం.. కాకినాడలో పవన్ కల్యాణ్ పిలుపు..
అభివృద్ధి, సంక్షేమాన్ని చాటిన శకటాలు.. కాకినాడలో ఆకట్టుకున్న స్వాతంత్ర్య వేడుకలు..
కాకినాడ: కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన జరిగింది. పోలీసు దళాల నుంచి ఉప ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.
దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడికీ బాధ్యత ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివిధ శాఖలు శకటాల రూపంలో ప్రజలకు వివరించాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్న శాఖల్లో అమలవుతున్న పలు కార్యక్రమాలను కూడా శకటాల్లో ప్రదర్శించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన H.A.N.U.M.A.N., గ్రేట్ గ్రీన్ వాల్, గ్రీన్ కవర్ ప్రాజెక్టుల నమూనాలు ఆకట్టుకున్నాయి.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన పల్లెపండుగ, అడవితల్లిబాట, స్వచ్ఛ రథాలు అంశాలపై శకటాలు ప్రత్యేకంగా నిలిచాయి.
విద్యార్థులు రూపొందించిన శాస్త్ర, సాంకేతిక శకటాలు వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో రూపొందించిన పవన్ కల్యాణ్ చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలాగే విద్యార్థులు తయారు చేసిన రోబో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు నమస్కారం చేయడం అక్కడి వారిని ఆకట్టుకుంది. యువతలోని సాంకేతిక ప్రతిభను ఈ ప్రదర్శనలు చాటిచెప్పాయి.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాగిలాల ప్రదర్శన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రదర్శనలో భాగంగా ఓ పోలీసు జాగిలం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు పుష్పగుచ్ఛం అందించడం ప్రత్యేకంగా నిలిచింది.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నమూనా శకటం కూడా ఆకట్టుకుంది. ఇక నీటిపారుదల, విద్య, వ్యవసాయం, ఉద్యానవన శాఖలకు సంబంధించిన శకటాలు కూడా వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
శకటాల ప్రదర్శన అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని ప్రతిబింబించే ప్రదర్శనలతో విద్యార్థులు ప్రేక్షకులను అలరించారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుని రాజశేఖరం పాల్గొన్నారు.
అలాగే ఎమ్మెల్యేలు పంతం నానాజీ, నిమ్మకాయల చిన్న రాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, వరుపుల సత్యప్రభ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తలాటం నాగవెంకట సత్య, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.
కాకినాడలో జరిగిన ఈ వేడుకలు జాతీయ స్ఫూర్తి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్మరణతో పాటు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల ప్రతిభను ఒకే వేదికపై ప్రతిబింబించాయి.
Tags
Be the first to react