క్రీడల్లో ప్రతిభ కనబరిచిన యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకునే అరుదైన అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష, మహిళా క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయనున్నారు. రైల్వే ఉద్యోగంతో పాటు క్రీడా ప్రతిభకు గుర్తింపు కోరుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్గా చెప్పవచ్చు.
ఈ నోటిఫికేషన్ కింద గ్రూప్-సి (లెవెల్-4, లెవెల్-5) కేటగిరీలో 5 పోస్టులు, గ్రూప్-సి (లెవెల్-2/3) కేటగిరీలో 16 పోస్టులు, గ్రూప్-డి (లెవెల్-1) కేటగిరీలో 33 పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్హతలతో పాటు క్రీడారంగంలో గుర్తింపు పొందిన విజయాలు తప్పనిసరి. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా స్పోర్ట్స్ టాలెంట్ ఆధారంగానే జరుగుతుంది.
అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, వాటర్ పోలో, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్ తదితర క్రీడాంశాల్లో ఏదైనా ఒక విభాగంలో నోటిఫికేషన్లో సూచించిన విధంగా రాష్ట్ర, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు సడలింపులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 10, 2026 నుంచి ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకంలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల విద్యార్హతలు, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్లు చేసే పరిశీలన ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు రుసుము జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, దివ్యాంగులు, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష భయం లేకుండా రైల్వే ఉద్యోగం పొందాలనుకునే క్రీడాకారులకు ఇది ఒక అద్భుత అవకాశం.