దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) మరోసారి కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. నష్టాలు, పెరుగుతున్న ఎన్పీఏలు, అంతర్జాతీయ స్థాయిలో పోటీ సామర్థ్యం వంటి సవాళ్ల మధ్య కేంద్ర ప్రభుత్వం మరోసారి బ్యాంకుల విలీనంపై గంభీరంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో చర్చలు ప్రారంభించింది. భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. భారతదేశానికి మరిన్ని పెద్ద, ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమని ఆమె స్పష్టం చేశారు. దీంతో మరోసారి బ్యాంకు ఏకీకరణ ప్రక్రియ మొదలవుతుందా? అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు అంతర్జాతీయంగా పోటీ పడే స్థాయికి చేరాలంటే మూలధనం, ఆస్తులు, సాంకేతిక సామర్థ్యం పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విలీనమే సరైన మార్గమని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
నివేదికల ప్రకారం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి చిన్న ప్రభుత్వ బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేసే అవకాశం ఉంది. వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి భారీ బ్యాంకులతో కలపవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా, ఆస్తుల పరంగా ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే 43వ స్థానంలో ఉంది. ప్రైవేట్ రంగంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 73వ స్థానంలో కొనసాగుతోంది. ఈ గణాంకాలే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు కారణమవుతున్నాయి.
ఇదే తొలిసారి కాదని గుర్తు చేయాలి. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం మెగా బ్యాంకు విలీనాన్ని ప్రకటించింది. 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రక్రియలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను 12 బ్యాంకులుగా తగ్గించారు. యునైటెడ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం అయ్యాయి. సిండికేట్ బ్యాంక్ కానరా బ్యాంక్లో కలిసింది. అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్లో విలీనం కాగా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భాగమయ్యాయి. అంతకుముందు 2008లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ కూడా ఎస్బీఐలో విలీనం అయ్యాయి. ఇప్పుడు మరోసారి బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులకు కేంద్రం సిద్ధమవుతోందా? అన్న ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.