⚡ BREAKING

Modi: హర్యానాలో భారత తొలి హైడ్రోజన్ రైలుకు ప్రధాని మోదీ పచ్చజెండా!

Modi: భారత రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్‌లో జింద్–సోనిపట్ మార్గంలో దేశపు తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుతో భారతదేశం స్వచ్ఛమైన, పర్యావరణహిత రైల్వే రవాణా దిశగా మరో ముందడుగు వేయనుంది.

Modi
Modi

స్వదేశీ సాంకేతికతతో రూపొందిన తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం..

10 కోచ్‌లతో ప్రపంచంలోనే అతిపెద్ద సామర్థ్యం గల హైడ్రోజన్ రైలు భారత్‌దే..

న్యూఢిల్లీ/జింద్: భారత రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్‌లో జింద్–సోనిపట్ మార్గంలో దేశపు తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుతో భారతదేశం స్వచ్ఛమైన, పర్యావరణహిత రైల్వే రవాణా దిశగా మరో ముందడుగు వేయనుంది.

హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హర్యానాలోని ఎకలవ్య స్టేడియంలో రూ.14,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

భారతదేశంలోనే రూపకల్పన, ఇంజినీరింగ్, సమీకరణ చేసిన ఈ హైడ్రోజన్ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది. అధునాతన రైల్వే ఇంజినీరింగ్ రంగంలో భారత్ సాధించిన సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరనుంది. ప్రస్తుతం జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలు మాత్రమే ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి.

ఈ హైడ్రోజన్ రైలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. జర్మనీ, చైనా వంటి దేశాల్లో సాధారణంగా రెండు లేదా మూడు బోగీలతో హైడ్రోజన్ రైళ్లు నడుస్తుండగా, భారత్ ఏకంగా 10 బోగీలతో కూడిన హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసింది. ఇందులో సుమారు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉండటంతో, సామర్థ్య పరంగా ఇది ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలిచింది.

అలాగే 3,200 హార్స్‌పవర్ శక్తి కలిగిన ప్రొపల్షన్ వ్యవస్థతో ఈ రైలు పనిచేయడం మరో విశేషం. దీంతో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఆధారంగా ఈ రైలు పనిచేస్తుంది. హైడ్రోజన్‌ను విద్యుత్‌గా మార్చి రైలును నడిపే ఈ వ్యవస్థలో ఉప ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. అందువల్ల రైలు ప్రయాణంలో కార్బన్ ఉద్గారాలు ఉండవు.

సాంప్రదాయ విద్యుత్ రైళ్ల మాదిరిగా నిరంతర ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు అవసరం లేకుండానే, రైలులోనే విద్యుత్ ఉత్పత్తి కావడం వల్ల ఇది మరింత సమర్థవంతమైన, పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థగా నిలుస్తోంది.

హైడ్రోజన్ లీకేజీలు, అధిక ఉష్ణోగ్రత, మంటలు, పొగ వంటి ప్రమాదాలను వెంటనే గుర్తించే బహుళ స్థాయి భద్రతా వ్యవస్థలను ఈ రైలులో ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ ఆధారిత రైళ్ల నిర్వహణ కోసం జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్ సదుపాయాన్ని కూడా అభివృద్ధి చేశారు. దీంతో సురక్షితంగా, సమర్థవంతంగా రైళ్లను నిర్వహించే అవకాశం ఏర్పడింది.

హర్యానా పర్యటన అనంతరం ప్రధాని మోదీ చండీగఢ్‌లో రూ.4,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, పూర్తి అయిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

తదుపరి పంజాబ్‌లోని జలంధర్లో రూ.5,470 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

హైడ్రోజన్ రైలు ప్రారంభం ద్వారా భారత రైల్వే రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ, పర్యావరణహిత సాంకేతికత వైపు దేశం వేగంగా అడుగులు వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Be the first to react

Latest