పాలన, అభివృద్ధిలో ఉత్తమ పనితీరు చూపిన, జిల్లాలకు ర్యాంకులు ప్రకటించనున్న ఏపీ రెవెన్యూ శాఖ..
ఈ-ఆఫీస్ విధానానికి ప్రాధాన్యమిస్తోన్న ఏపీ ప్రభుత్వం..
అమరావతిలో రాష్ట్ర పరిపాలనకు కీలకంగా నిలిచే కలెక్టర్ల సదస్సు రేపు, ఎల్లుండి సచివాలయంలో జరగనుంది. జిల్లాల అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో మెరుగుదల సాధించేందుకు ఈ సదస్సు వేదికగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పనితీరును సమీక్షిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలకు ర్యాంకులు ప్రకటించేందుకు ఏపీ రెవెన్యూ శాఖ సిద్ధమైంది.
ఏ జిల్లాలు ఎలాంటి కారణాలతో ఉత్తమ ర్యాంకులు సాధించాయో, వారు అనుసరించిన విధానాలు ఏమిటో సీఎస్ ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ముఖ్యంగా ఈ-ఆఫీస్ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వ దృష్టి, ఫైళ్ల పరిష్కారం వేగవంతం చేయడం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత పెంచడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ప్రజల సంతృప్తి స్థాయి ఎలా ఉంది? ఫిర్యాదుల పరిష్కారం ఎంత వేగంగా జరుగుతోంది? వంటి కీలక అంశాలు కూడా సదస్సులో ప్రాధాన్యం పొందనున్నాయి. తొలిరోజు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం “స్వర్ణాంధ్ర-2047” లక్ష్యాలపై ప్రత్యేక చర్చ జరగనుంది.
ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సాధించిన ఫలితాలు, జిల్లాల వారీగా అభివృద్ధి పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ప్రభావం వంటి అంశాలపై కూడా సమగ్ర సమీక్ష జరుగుతుంది. ఈ సదస్సు ద్వారా జిల్లాల మధ్య పోటీ వాతావరణం పెరగడంతో పాటు, పరిపాలనలో మరింత పారదర్శకత, వేగం తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.