మహానాడు కార్యక్రమంలో జరగబోయేటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం పూర్తయింది..
కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి సభ్యులు వచ్చి స్థలం పరిశీలించి ఫైనల్ చేశారు..
కొవ్వూరు: ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కొవ్వూరులో మహానాడు వేదికను ఖరారు చేసిన నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు.
స్థల పరిశీలన అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ, మహానాడు కోసం అవసరమైన స్థలం ఎంపిక పూర్తైందని తెలిపారు. ఈ స్థలాన్ని ఇప్పటికే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సభ్యులు పరిశీలించి ఫైనల్ చేశారని, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నుంచి కూడా అనుమతి లభించిందని చెప్పారు.
మహానాడు మూడు రోజుల కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. రేపు ఉదయం శుభ ముహూర్తంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని తెలిపారు. మహానాడు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించేందుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి, వక్ఫ్ బోర్డు చైర్మన్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాంగణాన్ని సందర్శించినట్లు చెప్పారు.
మహానాడుకు సంబంధించిన ప్రణాళిక మొత్తం ఇప్పటికే సిద్ధమైందని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ మహానాడు ప్రాంగణంలోనే బస చేయనున్నారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ చరిత్రలో 44 ఏళ్లలో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు జరగడం విశేషమని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ మహానాడుతో నెల్లూరు జిల్లా ముఖచిత్రం మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడు రోజుల మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. కొవ్వూరులో ఎంపిక చేసిన ఈ వేదికలో జరిగే మహానాడు జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకురానుందని స్థానిక నాయకులు భావిస్తున్నారు.