టన్నెల్-2 లో 12 వ కి. మీ దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మెషిన్ దగ్గరకు వెళ్లిన మంత్రి నిమ్మల..
టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు కూడా టన్నెల్ నుండి బయటికి రాదు..
డోర్నాల (మార్కాపురం జిల్లా): వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించేందుకు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రివేళే టన్నెల్లోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. టన్నెల్లో దాదాపు 19 కిలోమీటర్ల మేర ప్రయాణించి, అక్కడ జరుగుతున్న లైనింగ్, బెంచింగ్ పనులను సమీక్షించారు.
టన్నెల్లో 5 గ్యాంట్రీలతో కొనసాగుతున్న పనుల స్థితిని తెలుసుకున్న మంత్రి, అక్కడ పని చేస్తున్న కార్మికుల యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషిన్) వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల విమర్శలు చేశారు. టీబీఎంను తొలగించేందుకు అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అది అలాగే ఉండిపోతే టన్నెల్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదన్నారు. ఇంకా రూ.3 వేల కోట్ల పనులు మిగిలి ఉండగానే వెలిగొండ ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేశారని, దీని వల్ల ప్రకాశం జిల్లా రైతులు మోసపోయారని ఆరోపించారు.
పర్యటనలో భాగంగా మంత్రి నిమ్మల టన్నెల్-2లోనే అధికారులు, కార్మికులతో కలిసి భోజనం చేసి వారితో మమేకమయ్యారు. పనుల మధ్యలో కూడా కార్మికుల కష్టాలను అర్థం చేసుకుంటూ వారికి ధైర్యం చెప్పారు.
అలాగే, టన్నెల్లో కొన్ని చోట్ల సాఫ్ట్ రాక్ ఉండటం వల్ల కొండ రాళ్లు ఊడి పడే ప్రమాదం ఉందని గుర్తించి, అలాంటి ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ పనులు కొనసాగించాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు మంత్రి సూచించారు. వెలిగొండ ప్రాజెక్ట్ పనులు వేగంగా, సురక్షితంగా పూర్తి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.