కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం..
మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు..
గోరంట్ల/శ్రీసత్యసాయి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవిత వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. “ప్లేస్ మీరు చెప్పినా… నేను చెప్పినా… చర్చకు రెడీ” అంటూ ఆమె ధీమాగా పేర్కొన్నారు.
గోరంట్ల మండలంలో కరావులపల్లి నుంచి కరావులపల్లి తండా వరకు రూ.60 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును, అలాగే బూచేపల్లి నుంచి కొత్తపల్లి వరకు రూ.2.47 కోట్లతో నిర్మించిన మరో బీటీ రోడ్డును జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, రహదారులే అభివృద్ధికి అసలు పునాది అని స్పష్టం చేశారు.
“గత పాలకులు మీటరు రోడ్డు కూడా వేయలేకపోయారు. ఇప్పుడు రోడ్లు లేని గ్రామాలకు బీటీ, సీసీ రోడ్లు వేస్తున్నాం” అని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
గత ఎన్నికల సమయంలో బూచేపల్లి గ్రామస్తులు రహదారి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో “రోడ్డేసిన తరువాతే వస్తాను” అని చెప్పానని, ఇచ్చిన మాట నిలబెట్టుకుని రూ.2.50 కోట్లతో రోడ్డు నిర్మించి ఈరోజు గ్రామానికి వచ్చానని చెప్పారు. బూచేపల్లి పంచాయతీలో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. గ్రామ ప్రజలు ఇచ్చిన మద్దతుకు రుణపడి ఉంటానని, అభివృద్ధికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం 23 నెలల్లో చేసిన అభివృద్ధిపై పెనుకొండ, పులివెందుల, ధర్మవరంలాంటి ప్రాంతాలపై చర్చకు సిద్ధమని మంత్రి సవిత పేర్కొన్నారు. “మీరు ప్లేస్ చెప్పాలా… లేక నేను చెప్పాలా?” అంటూ వైసీపీ నాయకులను ప్రశ్నించారు. గతంలో పెనుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి లేదని, కనీస రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదని విమర్శించారు.
విలేకరులతో మాట్లాడుతూ, గత ఐదేళ్లలో రాష్ట్రానికి జగన్ ప్రభుత్వం ఏమి చేయలేదని మంత్రి మండిపడ్డారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. “ఒక కొత్త పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక సాగునీటి కాలువ పూర్తి చేశారా?” అని ప్రశ్నించారు. జగన్ హయాంలో జరిగిన ఒప్పందాల వివరాలు వెల్లడించాలని మంత్రి నారా లోకేష్ అడిగినా, వైసీపీ నేతలు స్పందించడం లేదని అన్నారు. “జగన్ది చోరీ క్రెడిట్… మాకు ఆ క్రెడిట్ అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు.
పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుందని మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమతో వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే కియా, బెల్ వంటి పరిశ్రమలు వచ్చినట్లు గుర్తుచేశారు. తాజా పెట్టుబడులతో సత్యసాయి జిల్లా రూపురేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడి కృషిని ప్రశంసిస్తూ, జిల్లాలో భారీ పరిశ్రమల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రి సవితకు బూచేపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.