అపాయింట్మెంట్ కోరుతూ గవర్నర్ కు విజయ్ లేఖ..
అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు 14 రోజుల గడువు కావాలని విజ్ఞప్తి..
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. TVK పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ విజయ్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకునేందుకు 14 రోజుల గడువు ఇవ్వాలని విజయ్ గవర్నర్ను కోరారు. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ 118 చేరడానికి TVK బృందం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎన్నికల్లో TVK పార్టీ మెజారిటీకి ఇంకా 10 సీట్ల దూరంలో నిలవడంతో, మిగిలిన మద్దతు కోసం ఇతర పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో కాసేపట్లో కొత్తగా ఎన్నికైన TVK ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఇందులో ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
తమిళనాడు ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, విజయ్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సానుకూలంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశముంది. విజయ్ నాయకత్వంలోని TVK ప్రభుత్వం ఏర్పాటుకు చేరువలో ఉందా? లేక చివరి క్షణంలో రాజకీయ సమీకరణాలు మారతాయా? అన్నది ఆసక్తిగా మారింది.