కీలక అంశాలపై సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం..
రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో గ్రామసభలు..
అమరావతి: రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఈ నెలాఖరుకల్లా అది 60 శాతానికి చేరుకుంటుందని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లో జరుగుతున్న భూసేకరణ పనులు సానుకూలంగా సాగుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజధాని ప్రాంతానికి సంబంధించిన కీలక అంశాలపై సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. భూ సమస్యలు, గ్రామ కంఠాల వివాదాలు, రోడ్ల నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోతున్న వారి పరిస్థితి, అలాగే గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశం అనంతరం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, సీఆర్డీఏకి కొత్త కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన విజయ రామరాజు గ్రామాల్లో స్వయంగా పర్యటించి పరిస్థితులను అంచనా వేయాలని సూచించినట్లు చెప్పారు. గ్రామ కంఠాల సమస్యలు, ఎఫ్ఎస్ఐ అంశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి విషయాలను గ్రౌండ్ లెవెల్లో పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కమిషనర్కు సూచించామని చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతులు, స్మశానాల ఏర్పాటు వంటి అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన విధానాల ప్రకారమే సమస్యలను పరిష్కరిస్తామని, వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశారు. అలాగే ఆర్-5 జోన్ను వెనక్కి తీసుకున్నామని, ప్రస్తుతం మూడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ 40 శాతం పూర్తైందని, ఈ నెలాఖరుకల్లా అది 60 శాతానికి చేరుకుంటుందని చెప్పారు. కౌలు పెంపుతో రైతులు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, రోడ్ల నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోతున్న వారికి NSP పాలసీ ద్వారా మెరుగైన పరిహారం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. గ్రామ కంఠాల సమస్యలను ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కరించేందుకు కమిటీ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. స్మశానాలు, ఇప్పటికే మంజూరైన మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ భార్గవ తేజతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మొత్తం మీద, రాజధాని అభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురావడమే ఈ సమావేశం లక్ష్యంగా నిలిచింది.