ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆయన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడానికి అన్నమయ్య జిల్లా రాయచోటినుంచి నేరుగా విశాఖ చేరుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు చేరుకునే సీఎం, నవంబర్ 14 మరియు 15 తేదీల్లో జరిగే 30వ సి.ఐ.ఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో భేటీ అవుతారు. నాలుగు రోజులపాటు వరుస భేటీలు, సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారని అధికారులు తెలిపారు.
నవంబర్ 13 (గురువారం) నాడు సిఐఐ సదస్సుకు హాజరయ్యే జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సీఎం వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం నోవాటెల్ హోటల్లో ‘ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్టేబుల్’లో పాల్గొనడం తో పాటు, “పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ – సస్టైనబుల్ గ్రోత్” అనే ప్రారంభ సెషన్లో ముఖ్య ప్రసంగం చేయనున్నారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక చర్చలు జరిపి, ‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’ కార్యక్రమానికి హాజరుకానున్నారు. చివరగా నెట్వర్క్ డిన్నర్తో రోజు ముగించనున్నారు.
నవంబర్ 14 (శుక్రవారం) నాడు సిఐఐ భాగస్వామ్య సదస్సు అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పాల్గొననున్నారు. ఏపీ పెవిలియన్ను సీఎం ప్రారంభించి, ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సెషన్లో ప్రత్యేక ప్రసంగం చేస్తారు. సదస్సు నుంచే డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అదనంగా, సింగపూర్కి నేరుగా విమాన సర్వీసుల ఒప్పందం, అలాగే ఏపీ రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్లో ముఖ్య ప్రసంగం ఉంటాయి. విశాఖలో లులూ మాల్కు శంకుస్థాపన కూడా ఈ రోజే జరగనుంది.
నవంబర్ 15 (శనివారం) నాడు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు జరుగుతాయి. గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి సంస్థల ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. బహ్రెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతారు. ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’, ‘సస్టైనబుల్ సిటీస్’, ‘ఆంధ్ర టూరిజం విజన్’ వంటి ముఖ్యమైన చర్చలు, అలాగే మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ‘ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ పై చర్చ జరుగుతుంది. చివరగా సీఎం మీడియా బ్రీఫింగ్, వాలెడిక్టరీ సెషన్తో సదస్సు ముగుస్తుంది.
మొత్తం ఈ సదస్సులో 100కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు, 30కి పైగా పెట్టుబడి ఒప్పందాలు ఉండనున్నాయి. ఏఐ, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, టూరిజం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై కీలక చర్చలు జరుగుతాయి. ఏపీకి భారీగా పెట్టుబడులు రప్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. సమ్మిట్ను విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించి పెట్టుబడిదారులను ఆహ్వానించారు.