ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన..
ఇజ్రాయెల్ 'గోల్డెన్ హారిజన్' క్షిపణిపై భారత్ కన్ను..
టర్కీ, పాకిస్తాన్లకు చెక్..
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన అంతర్జాతీయ వ్యూహకర్తల్లో పెను ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పర్యటనలో ప్రధానంగా వినిపిస్తున్న 'హెక్సాగాన్' వ్యూహం కేవలం రెండు దేశాల మధ్య సంబంధం మాత్రమే కాదు ఇది ఆరు భౌగోళిక ప్రాంతాలను కలిపే ఒక భారీ రక్షణ ఆర్థిక వలయం. ఇండియా, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్, అరబ్ దేశాలు ఆఫ్రికన్ దేశాలను ఒకే తాటిపైకి తెస్తూ, మధ్యధరా సముద్రం నుండి హిందూ మహాసముద్రం వరకు ఒక 'భద్రతా కవచాన్ని' నిర్మించడమే దీని అంతరార్థం. ఇది ముఖ్యంగా టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా కనిపిస్తోంది.
టర్కీ ప్రస్తుత వైఖరిని గమనిస్తే, అది మధ్యధరా సముద్రంలో గ్రీస్ సైప్రస్ హక్కులను కాలరాస్తూ 'జూనియర్ చైనా'లా ప్రవర్తిస్తోంది. మరోవైపు పాకిస్తాన్కు సైనిక తోడ్పాటును అందిస్తూ భారత్కు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో, గ్రీస్ సైప్రస్లను భారత్ తన రక్షణ ఉత్పత్తులతో (బ్రహ్మోస్, ఆకాశ్ మిసైల్స్) శక్తివంతం చేయడం ద్వారా టర్కీకి ఒక గట్టి సంకేతాన్ని ఇస్తోంది. మోదీ ఈ పర్యటనలో జెరూసలంలో నిర్వహించబోయే ఇన్నోవేషన్ ఈవెంట్ నెసెట్ (పార్లమెంట్) ప్రసంగం ద్వారా ఈ కూటమి యొక్క బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంది.
ఇక రక్షణ రంగం విషయానికి వస్తే, ఇజ్రాయెల్ అందిస్తున్న 'గోల్డెన్ హారిజన్' బాలిస్టిక్ క్షిపణి అత్యంత కీలకమైనది.
800 కిలోమీటర్ల పైచిలుకు రేంజ్, మాక్ 5 వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి, సరిహద్దులు దాటకుండానే శత్రువుల బంకర్లను తుత్తునియలు చేయగలదు. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత్, ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీతో మరిన్ని అత్యాధునిక ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోబోతోంది. ఇది కేవలం ఆయుధాల కొనుగోలు మాత్రమే కాదు, 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా సంయుక్త తయారీకి ) మార్గం సుగమం చేయడం విశేషం.
ఆర్థికంగా చూస్తే, 'IMEC' (ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్) ప్రాజెక్టు ఈ పర్యటనలో ప్రధాన అజెండాగా ఉండనుంది. టర్కీ ఇరాన్లను బైపాస్ చేస్తూ సాగే ఈ రూట్ ద్వారా ప్రపంచ వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషించనుంది. ఇది ఆయా దేశాల గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసి, భారత ఎగుమతులకు సరికొత్త వేగాన్ని ఇస్తుంది. హైఫా పోర్టును అదానీ గ్రూప్ దక్కించుకోవడం కూడా ఈ వ్యూహంలో ఒక ప్రధాన భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రూట్ అందుబాటులోకి వస్తే సూయజ్ కెనాల్పై ఆధారపడటం తగ్గుతుంది.
రా (RAW) మొసాద్ (Mossad) మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్ మరింత పటిష్టం కావడం ఈ పర్యటనలో మరో ముఖ్య అంశం. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద నెట్వర్క్లను ఛేదించడానికి, ఈ రెండు సంస్థల మధ్య సమన్వయం తప్పనిసరి. టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా జరిగే రాడికలైజేషన్ను అడ్డుకోవడం, సరిహద్దు ఉగ్రవాదానికి చెక్ పెట్టడం వంటి అంశాలపై మోదీ-నెతన్యాహు మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరి 25 పర్యటన ఆసియా యూరోప్ దేశాల మధ్య ఒక కొత్త శక్తి కేంద్రాన్ని సృష్టించబోతోందని చెప్పడంలో సందేహం లేదు.