భారత్-చైనా సంబంధాల్లో మరో కీలక మలుపు తిరిగింది. గల్వాన్ లోయ ఘటన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్ నగరంలో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు.
2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలతో ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాల విరామం తర్వాత మోదీ చైనా పర్యటనకు వెళ్లడం గణనీయంగా మారింది. ఇటీవలే భారత్-చైనా సైనిక స్థాయిలో సమ్మతి కుదిరి, వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గస్తీ నిర్వహణకు సంబంధించి ఒప్పందం జరిగింది. దాంతో సంబంధాలు క్రమంగా మెరుగవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ప్రధాని మోదీ చివరిసారిగా 2019లో చైనాను సందర్శించారు. అనంతరం 2024లో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వంటి కీలక నాయకులు ఎస్సీవో సమావేశాల నిమిత్తం చైనాలో పర్యటించడం గమనార్హం.
ఈ సందర్శనల్లో భారత్ తన స్థానం స్పష్టంగా తెలిపింది. ఉగ్రవాదంపై సరైన స్పష్టత లేకపోవడంతో ఎస్సీవో రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనకు భారత్ మద్దతివ్వలేదు. ఉగ్రవాదంపై ద్వంద్వ ధోరణిని విడనాడాలని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అజిత్ డోభాల్ గట్టిగా డిమాండ్ చేశారు.