ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్న ప్రవాస తెలుగు ప్రజలు..
ఎనఆరఐల సహకారంతోనే టీడీపీ విజయ యాత్ర కొనసాగుతుంది..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు–2026 మరియు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 150 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు హాజరై ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.
లాస్ ఏంజెల్స్ ఆరంజ్ సిటీలోని తండూరి రెస్టారెంట్లో జరిగిన ఈ వేడుకల్లో మహానాడు తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల తమ అంకితభావాన్ని నాయకులు, కార్యకర్తలు మరోసారి వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు జాతికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ నాయకులు నివాళులర్పించారు. ఈ వేడుకలు ప్రవాస తెలుగు సమాజంలో టీడీపీకి ఉన్న ఆదరణను, ఐక్యతను స్పష్టంగా చాటిచెప్పాయి.
ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్గా హాజరయ్యారు. లాస్ ఏంజెల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, శ్రీధర్ సాతులూరి, వంశీ గరికపాటి, విష్ణు యలమంచి, ప్రతాప్ మెతరమిట్ట, సురేష్ అయినంపూడి, సురేష్ అంబటి, చందు గుత్తికొండ, శ్రీకాంత్ అత్తోటి, కిషోర్ గరికపాటి, వెంకట్ సుంకర తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం దీనికి నిదర్శనమన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత ముఖచిత్రం మారబోతోందన్నారు. రాష్ట్రంలో మరో ఏడు కొత్త ఎయిర్పోర్టులు కూడా రానున్నాయని చెప్పారు.
విజయవాడ నుంచి సింగపూర్కు ఇప్పటికే నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించామని, త్వరలో మలేషియా, హాంకాంగ్, గల్ఫ్ దేశాలకు కూడా డైరెక్ట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ విజయంలో ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో కీలకమని, 2029 ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో సహకారం అందించాలని కోరారు.
ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేస్తున్న కృషికి ప్రవాసాంధ్రుల మద్దతు అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్ఆర్ఐలకు అవసరమైన సహాయం అందించేందుకు తాను వారధిగా ఉంటానని హామీ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఆర్ఐల సహకారంతో పార్టీ విజయాన్ని సాధించిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ మద్దతు కొనసాగించాలని కోరారు.
ప్రముఖ విశ్లేషకుడు, టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు కార్యక్రమాలు జరగడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో లాస్ ఏంజెల్స్ ప్రాంతానికి చెందిన అనేక మంది టీడీపీ అభిమానులు, ప్రవాస తెలుగు నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, టీడీపీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.