ఫ్రీమాంట్లో పసుపుమయం అయిన టీడీపీ మహానాడు సంబరాలు..
అమెరికాలో ఎన్నారై టీడీపీని మరింత బలోపేతం చేస్తాం : జయరాం కోమటి..
అమెరికాలోని బే ఏరియాలో ఎన్టీఆర్ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్రీమాంట్ పట్టణంలోని భీమవరం రుచులు రెస్టారెంట్లో జరిగిన ఈ కార్యక్రమం తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, ఎన్నారై టీడీపీ నేతలతో సందడిగా మారింది.
మే 28న నిర్వహించిన ఈ వేడుకల కోసం రెస్టారెంట్ను ప్రత్యేకంగా అలంకరించారు. ఒకవైపు స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన సినిమాల ఫోటోలు, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భారీ చిత్రాలతో పాటు టీడీపీ జెండాలు, కండువాలతో మొత్తం ప్రాంగణం పసుపు వర్ణంలో కళకళలాడింది.
కార్యక్రమానికి వచ్చిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులను ఎన్నారై టీడీపీ నాయకులు శ్రీకాంత్ దొడ్డపనేని, భక్తా భల్లా, వెంకట్ అడుసుమిల్లి తదితరులు ఆత్మీయంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి జయరాం కోమటి మాట్లాడుతూ బే ఏరియా విస్తృత ప్రాంతం కావడంతో మిల్పిటాస్లో రెండు రోజులుగా జరిగిన మహానాడు వేడుకలతో పాటు ఫ్రీమాంట్లో కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.
తాను దాదాపు 40 ఏళ్ల క్రితమే అమెరికాకు వచ్చానని, రెస్టారెంట్ వ్యాపారం ద్వారా ప్రజలతో మమేకం కావడం వల్ల సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరిగిందని జయరాం కోమటి తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఆయన పరిపాలన చూసి తెలుగు దేశం పార్టీలో చేరానని చెప్పారు.
ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా ఎంతో మంది ఎన్నారైలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి సేవ చేస్తున్నారని అన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ ఎన్నారైల సేవలకు మరింత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఎన్నారైలు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాకుండా వివిధ కీలక పదవుల్లో కూడా సేవలందిస్తున్నారని తెలిపారు. తమతో కలిసి పనిచేసిన చంద్ర పెమ్మసాని ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు.
ఇక కొత్త తరహా ఎన్నారై నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని జయరాం కోమటి అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఉన్న ప్రతి ఎన్నారై టీడీపీ కార్యకర్త పార్టీ కోసం మరింత బాధ్యతతో పనిచేసి నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఎన్నారై టీడీపీని మరింత బలోపేతం చేయాలని తాను మహానాడులో చంద్రబాబు, లోకేష్లకు విజ్ఞప్తి చేశానని, త్వరలో అమెరికాలో ఎన్నారై టీడీపీ కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా జయరాం కోమటిని శ్రీకాంత్ దొడ్డపనేని, భక్తా భల్లా, సుబ్బా యంత్ర, వెంకట్ అడుసుమిల్లి తదితరులు సత్కరించారు.
విజయవాడ నుంచి వర్చువల్గా మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారైల సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఎన్నారై మంత్రి హోదాలో తాను ఎప్పుడూ విదేశాల్లోని తెలుగు వారి సమస్యలు, అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని చెప్పారు.
ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు రవి వేమూరి మాట్లాడుతూ, ఎన్నారైల కోసం ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ రంగాల్లో కొత్త అవకాశాలు కల్పించే పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. ఎన్నారైలు ఏపీఎన్ఆర్టీ సభ్యత్వం ద్వారా ఆ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, తాను ఒకప్పుడు న్యూయార్క్లో టీడీపీ కార్యకలాపాలు నిర్వహించానని, తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి పార్టీ సేవలో కొనసాగుతున్నానని చెప్పారు. తిరుపతి దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు ఏపీఎన్ఆర్టీ ఇప్పటికే చేస్తోందని, ఇతర ఆలయ దర్శనాలకు కూడా సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే శిరీష గౌతు, ఎస్.కోట టీడీపీ నాయకుడు కృష్ణ గొంప కూడా మాట్లాడారు. బే ఏరియా ఎన్నారై నాయకులు భక్తా భల్లా, శ్రీకాంత్ దొడ్డపనేని, వెంకట్ అడుసుమిల్లి, భరత్ ముప్పిరాల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీకాంత్ దొడ్డపనేనిని పలువురు అభినందించారు. ఎన్టీఆర్ జయంతి, మహానాడు వేడుకలు బే ఏరియాలో టీడీపీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని నింపాయని పాల్గొన్న వారు పేర్కొన్నారు.