రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సెప్టెంబర్ నెలలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త రైలు భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు, దేశంలోనే మొదటి బుల్లెట్ రైలు సేవలు త్వరలో ముంబై-అహ్మదాబాద్ మధ్య మొదలవుతాయని తెలిపారు. ఈ బుల్లెట్ రైలు 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాల్లో చేరుకుంటుందని చెప్పారు.
వందే భారత్ స్లీపర్ రైలు అనేది ఒక కొత్త రకం సెమీ-హై-స్పీడ్ రైలు. రాత్రిపూట ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని రూపొందించారు. ప్రస్తుతం దేశంలో 50కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నప్పటికీ, వాటిలో కేవలం సీటింగ్ సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. అవి సాధారణంగా శతాబ్ది రూట్లలో ప్రయాణిస్తాయి.
అయితే, ఈ కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు రాజధాని రూట్లలో నడుస్తాయి. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ రైలులో ఏసీ ఫస్ట్క్లాస్, ఏసీ 2 టయర్, ఏసీ 3టయర్ వంటి 16 కోచ్లలో మొత్తం 1,128 మంది ప్రయాణించవచ్చు. ఈ రైళ్లను న్యూ ఢిల్లీ-హౌరా, న్యూ ఢిల్లీ-ముంబై, న్యూ ఢిల్లీ-పూణే, న్యూ ఢిల్లీ-సికిందరాబాద్ మధ్య నడపాలని యోచిస్తున్నారు, అయితే దీనిపై రైల్వే బోర్డు ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మరికొన్ని కొత్త రైళ్లు, ప్రాజెక్టులు…
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల భావ్నగర్లో మూడు కొత్త రైళ్లను డిజిటల్గా ప్రారంభించారు. అవి: అయోధ్య ఎక్స్ప్రెస్, రేవా-పూణే ఎక్స్ప్రెస్, మరియు జబల్పూర్-రాయ్పూర్ ఎక్స్ప్రెస్. అంతేకాకుండా, ఎనిమిది కొత్త అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రవేశపెట్టినట్టు ఆయన ప్రకటించారు.
భారత రైల్వేల పునర్నిర్మాణం గురించి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ హయాంలో రైల్వేలు గణనీయమైన ఆధునికీకరణకు నోచుకుంటున్నాయని తెలిపారు. రోజుకు 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కొత్త ట్రాక్లను వేస్తున్నామని, ఇది భారత రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పారు. ఇప్పటివరకు 34,000 కిలోమీటర్ల కొత్త ట్రాక్లు వేశారు. అలాగే, దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వివరించారు.