ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డు అనేది ప్రతి అవసరానికి తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ పథకాల నుండి రైల్వే టికెట్ల బుకింగ్ వరకు అనేక సేవలకు ఆధార్ లేకపోతే పనులు ముందుకు సాగవు. ఇప్పటివరకు ఆధార్లో మార్పులు చేయాలంటే లేదా వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించాల్సి వచ్చేది. దీనివల్ల సాధారణ ప్రజలు సమయం, డబ్బు వృథా చేసుకోవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. పౌరులకు ఆధార్ సంబంధిత సేవలను మరింత సులభతరం చేయడానికి ఒక వినూత్న మొబైల్ అప్లికేషన్ను తీసుకురావడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సన్నద్ధమవుతోంది.
ఈ మొబైల్ అప్లికేషన్ ఈ ఏడాది డిసెంబర్ నాటికే ప్రజల వినియోగానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా ఇకపై ఆధార్ సేవా కేంద్రాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ-ఆధార్ డౌన్లోడ్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఆధార్ నంబర్, ఓటీపీ ధృవీకరణ ద్వారా ఎవరైనా సులభంగా తమ ఈ-ఆధార్ను పొందగలరు. ఆధార్ కార్డుదారులు ఈ యాప్ ద్వారా తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక సమాచారాన్ని ఇంటి వద్ద నుంచే అప్డేట్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
ఈ కొత్త యాప్లో ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఫేస్ ఐడీ వంటి సెక్యూరిటీ టెక్నాలజీలు ఇందులో భాగం కానున్నాయి. దీని ద్వారా ఆధార్ అప్డేట్ ప్రక్రియ మరింత భద్రతతో సాగుతుంది. అయితే నవంబర్ నుండి ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ అప్డేట్ల కోసం మాత్రం ఆధార్ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాల్సి ఉంటుంది. ఈ యాప్లో UIDAI ప్రత్యేకంగా డాక్యుమెంట్ల సేకరణ ఫీచర్ను కూడా ప్రవేశపెట్టనుంది. బర్త్ సర్టిఫికెట్లు, పాన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, MNREGA రికార్డులు, కరెంట్ బిల్స్ వంటి పత్రాలను నేరుగా ప్రభుత్వ రికార్డుల నుంచే ఆటోమేటిక్గా సేకరించే అవకాశం కల్పించనుంది.
ఈ మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి వస్తే పౌరులకు సమయం ఆదా అవుతుంది. పేపర్ వర్క్ తగ్గుతుంది. మోసాలను నియంత్రించగలుగుతుంది. అంతేకాక ఆధార్ సంబంధిత ప్రక్రియలు మరింత వేగవంతం అవుతాయి. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, రైల్వే టికెట్ల బుకింగ్ వంటి దినసరి అవసరాలు మరింత సులభతరం అవుతాయి. మొత్తం మీద ఆధార్ యాప్ ప్రవేశపెట్టడం భారత పౌరులకు ఒక పెద్ద బహుమతిగా భావించవచ్చు. ఈ డిజిటల్ అడుగు ముందుకు వేయడం ద్వారా ప్రజలకు ఆధార్ ఒక క్లిష్టమైన ప్రక్రియ కాకుండా, సులభమైన సేవలుగా మారబోతోంది.