ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులను మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తొమ్మిది రోజుల సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఉపాధ్యాయులు, ఎమ్మెల్సీలు 22వ తేదీ నుంచి సెలవులు ప్రారంభించాలన్న కోరికను విద్యాశాఖ మంత్రి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 11 రోజులపాటు దసరా సెలవులు ఉంటాయని తెలిపారు.
ప్రకటనతో విద్యార్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వాస్తవానికి సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు నుంచే సెలవులు మొదలవుతాయి. దీంతో స్కూల్ విద్యార్థులకు 21 నుంచి అక్టోబర్ 2 వరకు 12 రోజులపాటు నిరవధిక సెలవులు వచ్చినట్టైంది. ఈ నిర్ణయం పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో సంతోషాన్ని నింపింది. ముఖ్యంగా పండుగ సీజన్లో కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లభిస్తుందని అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికే 21వ తేదీ నుంచే దసరా సెలవులు అమల్లోకి వచ్చాయి. అక్కడ స్కూల్ విద్యార్థులకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు 13 రోజులపాటు సెలవులు లభిస్తున్నాయి. అంటే అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్కడ స్కూల్స్ తిరిగి ప్రారంభమవుతాయి. ఈసారి దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీన రావడంతో అదే రోజు గాంధీ జయంతి కూడా ఉండటంతో విద్యార్థులు ఒక సెలవును మిస్ అయినట్లయినా, మొత్తం లెక్కన పెద్ద సెలవుల ప్యాకేజ్ దక్కింది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి దసరా సందర్భంగా ఫుల్ ఎంజాయ్ మూడ్లోకి వెళ్లిపోయారు.
మొత్తం మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల అభిలాషలకు అనుగుణంగా నిలిచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో పండుగను ఎంజాయ్ చేసే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు కూడా ముందుగా కోరినట్టుగానే సెలవులు పొడిగించడంతో సంతృప్తి చెందారు. రాబోయే రోజుల్లో విద్యా రంగంలో ఇలాంటి అనుకూల నిర్ణయాలు విద్యార్థులకు మరింత ఉత్తేజాన్నిస్తాయని భావిస్తున్నారు.