ప్రధాని నరేంద్ర మోదీ రైతుల సంక్షేమం దేశ సుభిక్షతకు పునాది అని మరోసారి స్పష్టం చేశారు. “రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. దేశ అభివృద్ధి గుండెకాయ వ్యవసాయం అని, రైతు సంతోషమే నిజమైన ఆర్థిక పురోగతి అని ప్రధాని మోదీ తెలిపారు. నేటి తరానికి రైతు విలువను గుర్తుచేస్తూ ఆయన మాట్లాడుతూ మన అన్నదాతల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది. రైతు కష్టపడకపోతే మనకు అన్నం అందదు. కాబట్టి, రైతు చిరునవ్వు మనందరి బాధ్యత” అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని “PM ధన్ ధాన్య కృషి యోజన మరియు “దల్హన్ ఆత్మనిర్భరత మిషన్” అనే రెండు కీలక వ్యవసాయ పథకాలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ పథకాల ద్వారా ప్రభుత్వం రూ. 35 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేయనుందని వెల్లడించారు. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యమని వివరించారు. ధన్ ధాన్య కృషి యోజన కింద రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు, నీటి వనరుల అభివృద్ధి, భూమి సారాన్ని పెంచే సాంకేతికతలను అందిస్తామని తెలిపారు. ఇక దల్హన్ ఆత్మనిర్భరత మిషన్ ద్వారా పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం లక్ష్యమని చెప్పారు.
భారతీయ వ్యవసాయ రంగం ఇప్పుడు ఆత్మనిర్భర దిశగా పయనిస్తోంది. మన రైతు ఉత్పత్తి దేశ అవసరాలను మాత్రమే కాకుండా, ప్రపంచ మార్కెట్ అవసరాలను కూడా తీర్చగలగాలి. అందుకోసమే ఈ పథకాలు రూపొందించాం” అని ప్రధాని తెలిపారు. మోదీ మాట్లాడుతూ 2014 తర్వాత నుంచి మన ప్రభుత్వం రైతు సంక్షేమంపై నిరంతరంగా దృష్టి పెట్టింది. PM కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇప్పటివరకు కోట్లాది మంది రైతుల అకౌంట్లలో వేల కోట్ల రూపాయలు జమ చేశాం. సేంద్రీయ వ్యవసాయం, జీరో బడ్జెట్ ఫార్మింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక విధానాలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాం. దేశవ్యాప్తంగా 10 వేల కొత్త ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (FPOs) ఏర్పాటు జరుగుతోంది,” అని వివరించారు.
రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా, పంటల నిల్వ, మార్కెటింగ్, ఎగుమతుల వ్యవస్థలను ఆధునీకరించడమే తమ లక్ష్యమని చెప్పారు. మా ప్రభుత్వం రైతును కేవలం ఓటు బ్యాంక్గా కాకుండా, దేశ ఆర్థిక యంత్రాంగం హృదయంగా చూస్తోంది. ప్రతి రైతు కుటుంబం గౌరవంగా జీవించాలి అదే మా సంకల్పం” అని ప్రధాని స్పష్టం చేశారు. అతను ఇంకా చెప్పారు పాతకాలంలో రైతు అనే పేరు పేదరికానికి చిహ్నంగా ఉండేది. కానీ ఇప్పుడు రైతు అనే పేరు గర్వంగా వినిపిస్తోంది. మన దేశం వ్యవసాయ విప్లవం దిశగా ముందుకు సాగుతోంది. రైతులే ‘ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణానికి బలమైన స్థంభాలు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమ ప్రాంగణంలో వేలాది మంది రైతులు “జై కిసాన్, జై భారత్” నినాదాలతో ఘోషించారు. మోదీ రైతులకు హామీ ఇస్తూ “మీ చెమట ఒక్క చుక్క కూడా వృథా కావదు. ప్రభుత్వం మీతో ఉంది, మీ భవిష్యత్తు ప్రకాశవంతం చేసేందుకు నిరంతరం శ్రమిస్తుంది,” అని అన్నారు. ఆయన ప్రసంగం ముగింపు నాటికి ప్రజల మధ్య ఉత్సాహం నెలకొంది. రైతులపై ఇంత ప్రేమ చూపిన ప్రధాని పట్ల రైతులు కృతజ్ఞత వ్యక్తం చేశారు.