అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అయితే వాటిని ప్రజలకు వివరించడంలో కొంత వెనుకబడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నుంచి కాపాడటం అక్కడ పెట్టుబడులను తీసుకురావడం వంటి చర్యలు ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం అని అన్నారు.
విశాఖలో రైల్వే జోన్ ఐటీ కంపెనీలు, గూగుల్ డేటా సెంటర్ ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మంత్రులు ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలి అని సీఎం సూచించారు.
మంత్రి కందుల దుర్గేశ్ ప్రస్తావించిన పర్యాటక ప్రాజెక్టులపై సీఎం స్పందిస్తూ కార్యదర్శులు ముందుండి నడిపించేది మంత్రులే అని చెప్పారు. పనులు నిలిచిపోయినా లేదా ఆలస్యమైనా మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మీ శాఖల్లో జరుగుతున్న మంచి పనులు ప్రజలకు చేరకపోతే నష్టపోయేది మన ప్రభుత్వ అని సూచించారు.
ఏడాదిన్నర కాలంలోనే ఇంత పెట్టుబడులు రావడం గొప్ప విషయం. ఇది ప్రభుత్వ దిశా దృష్టి ఫలితం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చాలా సానుకూల పరిణామం. ఇది రాష్ట్రానికి ప్రతిష్ట తీసుకువస్తుంది అని అన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఉన్న అవమానకర పదాలను తొలగించే సంస్కృతి రావాలని పిలుపునిచ్చారు.
మంత్రి లోకేశ్ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ సమావేశాల కోసం ప్రత్యేక కాన్ఫరెన్స్ హాలు కట్టాలని సూచించగా క్యాబినెట్ సభ్యులంతా ఆ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. విశాఖ అభివృద్ధిని ముంబైతో పోల్చుతూ సీఎం తూర్పు తీరంలోని విశాఖ కూడా త్వరలో పశ్చిమ తీరంలోని ముంబైలా అభివృద్ధి చెందుతుంది”అని నమ్మకం వ్యక్తం చేశారు.
అల్పాహార సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, వైసీపీ కుల మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహ దహనం ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అదే పార్టీ నాయకులు ఆందోళన చేయడం దురదృష్టకరం అన్నారు.